ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఏకపక్ష విజయాలను కైవసం చేసుకున్న టీమిండియా మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే తమ చివరి లీగ్ మ్యాచ్లో ఒమన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా టీమిండియాకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. తొలి రెండు మ్యాచ్ల్లో టీమిండియా బ్యాటర్లకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలనే ఆలోచనలో టీమిండియా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా సూపర్-4కు అర్హత సాధించింది. కాబట్టి ఒమన్తో మ్యాచ్ ఓడినా.. గెలిచినా టీమిండియాకు జరిగే నష్టం ఏం లేదు. దాంతో ఈ మ్యాచ్కు బుమ్రా దూరంగా ఉంటాడని, అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్కు అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై మాట్లాడిన భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. బుమ్రాను ఒమన్తోనే కాకుండా పాకిస్థాన్తో ఆడించినా పోయే నష్టం ఏం లేదన్నాడు. అతన్ని సూపర్-4 మ్యాచ్లకు దూరంగా ఉంచి ఫైనల్లో ఫ్రెష్గా ఆడించాలని సూచించాడు. 'జస్ప్రీత్ బుమ్రాకు పాకిస్థాన్తో మ్యాచ్కు కూడా విశ్రాంతి ఇవ్వాలి. తద్వారా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్కు అతను ఫ్రెష్గా అందుబాటులోకి వస్తాడు. బుమ్రాకు విశ్రాంతినిచ్చి బెంచ్ ప్లేయర్ను తుది జట్టులోకి తీసుకోవాలి. ఒమన్ మ్యాచ్ నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలి.'అని గవాస్కర్ టీమిండియా మేనేజ్మెంట్కు చూపించాడు.

ఇప్పటికే లీగ్ దశలో ఒక మ్యాచ్ ఆడిన భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్-4లో భాగంగా ఆదివారం మరోసారి తలపడనున్నాయి. సూపర్ -4లో పాకిస్థాన్తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంకతో భారత్ తలపడనుంది. సూపర్-4లో భారత్, పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే మూడోసారి కూడా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు మ్యాచ్లు ఆడిన బుమ్రా 15.66 యావరేజ్, 6.71 ఎకానమీతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. యూఏఈ ఒక వికెట్ తీసిన బుమ్రా.. పాకిస్థాన్పై 2 వికెట్లు పడగొట్టాడు. 2016లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. 17.67 సగటు, 6.29 ఎకానమీతో 92 వికెట్లు పడగొట్టాడు.
ఆసియా కప్ 2025 ముగిసిన వెంటనే అక్టోబర్ 2 నుంచి సొంతగడ్డపై వెస్టిండీస్తో టీమిండియా రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు బుమ్రా ఫిట్గా ఉండటం కీలకం. ఈ క్రమంలోనే ఏకపక్షంగా సాగుతున్న ఆసియా కప్ నుంచి బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులతో పాటు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. వచ్చే వారం వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.