
న్యూఢిల్లీ: కెరీర్లో 100వ టెస్ట్ ఆడబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ ప్రయాణం చాలా గొప్పగా సాగిందని కొనియాడాడు. అతను అరంగేట్ర మ్యాచ్లోనూ ప్రత్యర్థి బౌలర్లను భయపడకుండా ఆడాడని గుర్తు చేసుకున్నాడు. శ్రీలంకతో రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోహ్లీకి కెరీర్లో 100వ టెస్ట్. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఓ జాతీయ చానెల్తో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపాడు.
'టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. 2011 వెస్టిండీస్ పర్యటనలో భాగంగా సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయం ఎంత మందికి గుర్తుందో తెలియదు కానీ, ఆడుతున్నది కెరీర్లో ఫస్ట్ టెస్ట్ అయినా.. ప్రత్యర్థి బౌలర్లకు కోహ్లీ ఏ మాత్రం భయపడలేదు. ఆ మ్యాచ్లో విండీస్ బౌలర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్.. కోహ్లీని తక్కువ స్కోరుకే ఔట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. దానికి బదులుగా కోహ్లీ కూడా అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన ఫిడేల్ ఎడ్వర్డ్స్ లాంటి వాళ్లతో.. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఓ కుర్రాడు ఇలా చేయడం చాలా అరుదు. అది తన ఆటపై తనకున్న నమ్మకం, ఎంత భయంకరమైన బౌలర్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేందుకు ఆ ఘటనే నిదర్శనం' అని సునీల్ గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు.
మరోవైపు, కోహ్లీ ఆడనున్న వందో టెస్టుకు ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. ఇంతకు ముందు, మొహాలీలో కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలు కాస్త ఆందోళన కలిగించాయని, అందుకే ప్రేక్షకులను అనుమతించవద్దని తొలుత బీసీసీఐ భావించిందన్నాడు. కానీ ప్రస్తుతం, పరిస్థితులు కాస్త మెరుగయ్యాయని, అందుకే, 50 శాతం మందితో మ్యాచ్ను నిర్వహిస్తున్నారని తెలిపాడు.
అద్భుత ఫామ్లో ఉన్న టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ని ఏ స్థానంలో బ్యాటింగ్కి పంపాలనే విషయంపై కాస్త గందరగోళం నెలకొందని సునీల్ గవాస్కర్ అన్నాడు. సీనియర్ ఆటగాళ్ల రాకతో అతను ఏ స్థానంలో ఆడుతాడనేది టీమ్మేనేజ్మెంట్ నిర్ణయించాల్సి ఉందన్నాడు.