
న్యూఢిల్లీ: గత మూడు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. మూడు మ్యాచుల్లో కోహ్లీ విఫలమైనంత మాత్రన మునిగిపోయేదేం లేదని, త్వరలోనే తిరిగి ఫామ్ అందుకుంటాడని ఈ మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'కోహ్లీ గొప్ప క్లాస్ బ్యాట్స్మన్. ఆ విషయం అందరికీ తెలిసిందే.
నెమ్మదిగా మొదలుపెట్టినప్పటికీ.. టోర్నీ ముగిసే సమయానికి విరాట్ కచ్చితంగా 500 పరుగులు పూర్తి చేస్తాడు. 2016లో అతను ఎలా విజృంభించాడో మనందరం చూశాం. అయితే ఈసారి అన్ని పరుగులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే మూడు మ్యాచులు అయిపోయాయి. మొదటి నుంచి బ్యాట్ ఝులిపించి ఉంటే ఈసారి కూడా దాదాపు వెయ్యి పరుగులు చేసే అవకాశం ఉండేది' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ విషయంలో ఓపిక అవసరమని అభిమానులకు సూచించాడు.
కింగ్స్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ గురించిన మాట్లాడుతూ అనుష్క శర్మను ప్రస్తావించిన గవాస్కర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరకు అనుష్కతో కూడా చివాట్లు తిన్నాడు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని గవాస్కర్ వివరణ ఇచ్చిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక లాక్డౌన్లో అనుష్క శర్మ బౌలింగ్ విరాట్ ప్రాక్టీస్ చేశాడని గవాస్కర్ అనగా.. ఈ కామెంట్స్ను కొందరు ఆకతాయిలు అనుష్క బంతులతో విరాట్ ప్రాక్టీస్ అని మార్చి ట్రోల్ చేశారు.
ఇక 2016 సీజన్లో రెచ్చిపోయి ఆడిన కోహ్లీ.. నాలుగు సెంచరీలతో ఏకంగా 973 రన్స్ చేశాడు. తాజా సీజన్లో మాత్రం గత మూడు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో 14(13 బంతులు), కింగ్స్ పంజాబ్పై 1(5), తాజాగా ముంబై ఇండియన్స్తో 3(11బంతుల్లో) పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ తిరిగి తన పాత ఫామ్ అందుకొని డివిలియర్స్కు తోడుగా నిలిస్తే జట్టుకు తిరుగుండదని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచుల్లో రెండిట్లో విజయాలు సాధించింది. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగి మ్యాచ్లో సూపర్ ఓవర్లో గెలుపొందింది.