టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేయకపోవడాన్ని సన్నీ తప్పుబట్టాడు. ఇదేం సెలెక్షన్ అంటూ శుభ్మన్ గిల్ను మందలించాడు. లోయరార్డర్ బ్యాటింగ్ కోసం కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టామని చెప్పిన గిల్ వ్యాఖ్యలపై గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. అలా చెప్పడానికి బుద్దుండాలని చివాట్లు పెట్టాడు.
బుధవారం ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా మూడు మార్పులు చేసింది. శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్పై వేటు వేసిన టీమిండియా.. జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చింది. ఈ ముగ్గురికి బదులు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్లకు అవకాశం కల్పించింది. టీమ్ సెలెక్షన్పై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్పిన్కు సహకరించే ఎడ్జ్బాస్టన్ మైదానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

'కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎడ్జ్బాస్టన్ వికెట్పై బంతి కాస్త టర్న్ అవుతుంది. ఇది తెలిసి కూడా కుల్దీప్ యాదవ్ను పక్కన పెడుతారా? బ్యాటింగ్ డెప్త్ కోసం కుల్దీప్ యాదవ్ను ఆడించడం లేదని చెప్పడం సిగ్గు చేటు. జట్టులోని టాపార్డర్ విఫలమైతే.. వాషింగ్టన్, నితీష్ రెడ్డి 7, 8వ స్థానాల్లో వచ్చి ఏం చేస్తారు? వాళ్లేమి తొలి టెస్ట్లో విఫలమైన బ్యాటర్లు కాదు కదా? తొలి మ్యాచ్లో మొత్తం 830కి పైగా పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్లో 380 పరుగులు చేయలేక ప్రత్యర్థికి అవకాశం కల్పించారు. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేయడం కాదు. వికెట్లు తీసే బౌలింగ్ విభాగాన్ని సిద్దం చేసుకోండి.'అని గవాస్కర్ చురకలంటించాడు.
టీమిండియా తుది జట్టు ఎంపికపై దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కుల్దీప్ యాదవ్ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. 'ఈ మ్యాచ్లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లుతో ఆడుతున్నట్లు నాకు అనిపించడం లేదు. టీమిండియా కుల్దీప్ యాదవ్ను తీసుకోకపోవడంతో పాటు ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్కు ఇదే మంచి అవకాశం. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తేనే ఈ మ్యాచ్లో టీమిండియాకు ఆశించిన ఫలితం దక్కుతుంది.'అని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(216 బంతుల్లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్) అజేయ శతకం చెలరేగగా.. యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో శుభ్మన్ గిల్తో పాటు రవీంద్ర జడేజా(67 బంతుల్లో 5 ఫోర్లతో 41 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(2/59) రెండు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసారు.