ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో టీమిండియా ఓటమికి కుట్ర జరిగిందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆరోపించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆఖరి రోజు ఆటలో కేఎల్ రాహుల్ ఔటైన విధానంపై లిటిల్ మాస్టర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్ హాక్-ఐ టెక్నాలజీపై సందేహాం వ్యక్తం చేశాడు. అంపైర్ల నిర్ణయాలు భారత్కు వ్యతిరేకంగా.. ఇంగ్లండ్కు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్లోనూ 39 పరుగులతో నిలకడగా ఆడాడు. అయితే ఆఖరి రోజు ఆట తొలి సెషన్లోనే బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ముందుగా అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఇంగ్లండ్ డీఆర్ఎస్ తీసుకొని ఫలితం రాబట్టింది. బాల్ ట్రాకింగ్లో బంతి లెగ్ స్టంప్స్ను తాకుతున్నట్లు చూపించడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.

ఆ సమయంలో కామెంట్రీ బాక్స్లో ఉన్న గవాస్కర్.. హాక్-ఐ టెక్నాలజీపై సందేహం వ్యక్తం చేశాడు. ఇదే తరహాలో సిరాజ్ బౌలింగ్లో జోరూట్ వికెట్ల ముందు దొరికిపోతే రిప్లేలో బాల్ ట్రాకింగ్లో విభిన్నంగా చూపించారని, బంతి లెగ్ స్టంప్స్ తాకినా అంపైర్స్ కాల్గా ఇచ్చారని గుర్తు చేశాడు. కానీ రాహుల్ విషయంలో మాత్రం ఔట్ ఇవ్వడం చూస్తుంటే ఏదో కుట్ర జరిగినట్లు అనిపిస్తుందని తెలిపాడు.
'ఆశ్చర్యకంగా ఉంది. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బాల్ ట్రాకింగ్లో బౌన్స్ కావడం లేదు. కానీ భారత బౌలర్ల బంతులు మాత్రం స్టంప్స్ కంటే ఎత్తులో దూసుకెళ్లినట్లు రిప్లేలో కనిపించాయి. ఈ టెక్నాలజీపై నాకు సందేహం కలుగుతోంది. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.'అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. గవాస్కర్ ఆరోపణలపై మాట్లాడేందుకు సహచర కామెంటేటర్ మైకేల్ వాన్ నిరాకరించాడు. నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంపైర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంపైర్లు పూర్తిగా ఇంగ్లండ్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు.