యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ధ్రువ్ జురెల్ చెలరేగుతాడని జోస్యం చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్లో అతనికి ప్రమోషన్ కూడా లభిస్తుందని తెలిపాడు.
ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన ఐదు టెస్ట్ల సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ధ్రువ్ జురెల్.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్ల్లో 90, 39 పరుగులతో రాణించాడు.

ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్ బరిలోకి దిగనున్నాడు. గతేడాదే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన అతను ఇంపాక్ట్ ప్లేయర్గా కొన్ని మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 172.73 స్ట్రైక్రేట్తో 152 పరుగులు చేశాడు.
ప్రమోషన్ పక్కా..
అంతర్జాతీయ క్రికెట్లో అతను కనబర్చిన ఫామ్ నేపథ్యంలో ధ్రువ్ జురెల్కు రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో చోటు దక్కుతుందని, బ్యాటింగ్లో కూడా అతను అప్ది ఆర్డర్ ఆడే అవకాశం ఉందని గవాస్కర్ తెలిపాడు. అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన గవాస్కర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఈ సీజన్లో సత్తా చాటే కుర్రాళ్లలో ధ్రువ్ జురెల్ ఒకడు. ఈ ఏడాది అతను ఆడిన తీరు.. గతేడాది ఐపీఎల్లో రాణించిన విధానం చూస్తుంటే బ్యాటింగ్ ఆర్డర్లో అతనికి ప్రమోషన్ లభించనుంది.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ముంబై బలహీనత అదే..
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు డెత్ బౌలింగ్లో సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులోకి వచ్చినా.. మరో ఎండ్లో అతనికి అండగా నిలిచే బౌలర్ ముంబై జట్టులో కనిపించడం లేదన్నాడు.
'ముంబై ఇండియన్స్కు డెత్ బౌలింగ్ సమస్యగా మారనుంది. జస్ప్రీత్ బుమ్రా ఉన్నా.. మరో ఎండ్లో పరుగులివ్వకుండా అడ్డుకట్ట వేసే బౌలర్ కనిపించడం లేదు. ఇదొక్కటే ముంబై ఇండియన్స్కు బలహీనతగా కనిపిస్తోంది.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
అయితే విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్.. భారీ స్కోర్లతో ఈ బలహీనతను అధిగమించవచ్చని సూచించాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.