ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ను ఓపెనర్గా కాకుండా ఫస్ట్ డౌన్లో ఆడించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆసియా కప్ టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో సంజూ శాంసన్కు అవకాశం దక్కుతుందని, అతని ప్రదర్శన ఆధారంగా జట్టులో కొనసాగించేది లేనిది నిర్ణయిస్తారని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు.
టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత జట్టు యూఏఈలో అడుగుపెట్టింది. సన్నాహకాలు కూడా ప్రారంభించింది. శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది. శుభ్మన్ గిల్ ఓపెనర్గా దిగితే.. సంజూ శాంసన్ను ఏ స్థానంలో ఆడిస్తారనేది కూడా చర్చనీయాంశమైంది. మూడో స్థానంలో తిలక్ వర్మ రాణిస్తుండగా.. లోయరార్డర్లో వికెట్ కీపర్గా జితేష్ శర్మకు మెరుగైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ సునీల్ గవాస్కర్ మాత్రం ఆరంభ మ్యాచ్ల్లో సంజూకు అవకాశం ఇస్తారని చెప్పాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'సంజూ శాంసన్ను మూడో స్థానంలో ఆడించాలి. నా అభిప్రాయం ప్రకారం జితేష్ శర్మకు బదులు సంజూ శాంసన్కే అవకాశం దక్కుతుంది. కనీసం ఆరంభ మ్యాచ్ల్లోనైనా అతన్ని ఆడిస్తారనుకుంటున్నా. అతను రాణిస్తే జట్టులో కొనసాగిస్తారు. లేదంటే తప్పించి జితేష్ శర్మకు అవకాశం కల్పిస్తారు. సంజూ శాంసన్ను మూడో స్థానంలో ఆడించి తిలక్ వర్మను ఫినిషర్గా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే జట్టులో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. అతను ఐదు, ఆరో స్థానంలోనే ఆడుతాడు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
అయితే తిలక్ వర్మ మూడో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతని బ్యాటింగ్ ఆర్డర్ను మార్చే అవకాశం లేదు. ఒకవేళ సంజూ శాంసన్ను ఆడించాలనుకుంటే ఫినిషర్గా బరిలోకి దించవచ్చు. సెప్టెంబర్ 10న యూఏఈతో భారత్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. 14న పాకిస్థాన్తో, 19న ఒమన్తో లీగ్ మ్యాచ్లు ఆడనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ 28న జరగనుంది.