ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సోమవారం లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్ట్లో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో టీమిండియా 170 పరుగులకే ఆలౌటైంది. టెయిలెండర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లతో కలిసి రవీంద్ర జడేజా(61 నాటౌట్) ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది.
బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా అద్భుతంగా పోరాడినప్పటికీ.. అతను కాస్త దూకుడుగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ అయిన షోయబ్ బషీర్ బౌలింగ్లో జడేజానే స్ట్రైక్ తీసుకోవాల్సిందని, సిరాజ్కు ఇచ్చి తప్పు చేశాడని తెలిపాడు. జడేజా పోరాటం అద్భుతమని కొనియాడాడు.

'ఇంగ్లండ్ లోయరార్డర్ బ్యాటర్లు చివరి మూడు వికెట్లకు 100 పరుగులు చేస్తే.. భారత లోయరార్డర్ మాత్రం విఫలమైంది. ఇరు జట్ల మధ్య వ్యత్యాసం ఇదే. తొలి ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ రనౌట్ అవ్వడం టర్నింగ్ పాయింట్. అతను మరికొద్ది సేపు బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 193 పరుగుల లక్ష్యచేధనలో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. సరైన పునాది వేయలేకపోయింది. చివరి రోజు తొలి సెషన్లోనే నాలుగు వికెట్లు కోల్పోవడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
ఒక్క 60-70 పరుగుల భాగస్వామ్యం నమోదైనా ఫలితం మరోలా ఉండేది. రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మరో ఎండ్ నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. జడేజా అద్భుతమైన బ్యాటింగ్తో 61 పరుగులు చేసినప్పటికీ స్పిన్నర్లు అయిన జోరూట్, షోయబ్ బషీర్ బౌలింగ్లో రిస్క్ తీసుకోవాల్సింది. డిఫెన్స్ కాకుండా దూకుడుగా ఆడాల్సింది. బషీర్ బౌలింగ్లో అతనే స్ట్రైక్ తీసుకోవాల్సింది. ఏది ఏమైనా జడేజా బ్యాటింగ్కు ఫుల్ మార్క్స్ వేయాల్సిందే. ఇంగ్లండ్.. భారత్ కంటే ఎక్కువ కసితో ఆడింది. ఈ సిరీస్ను సమం చేసే అవకాశాలు టీమిండియాకు ఉన్నాయి.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
కామెంట్రీ సమయంలో హాక్-ఐ టెక్నాలజీపై గవాస్కర్ సందేహాలు వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూ విషయాన్ని ప్రస్తావిస్తూ భారత్కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందన్నాడు. భారత బౌలర్ల బంతులు బాల్ ట్రాకింగ్లో బౌన్స్ అయ్యాయని, కానీ ఇంగ్లండ్ బౌలర్ల బంతులు మాత్రం బౌన్స్ కాలేదని తెలిపాడు. ఈ టెక్నాలజీపై తనకు సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించాడు.
మహమ్మద్ సిరాజ్ సంబరాలను తప్పుబడుతూ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ కేటాయించడంపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందులో తప్పేం ఉందని ప్రశ్నించాడు. 'బెన్ డకెట్ వికెట్ తీసుకున్న తర్వాత సిరాజ్ చేసుకున్న సంబరాల్లో తప్పేం ఉంది? వాస్తవానికి బెన్ డకెట్ సిరాజ్కు ఎదురుగా వచ్చాడు. ఈ క్రమంలో సిరాజ్ భుజం డకెట్కు తగిలింది. అది ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఆటగాళ్లు ఏం రోబోలు కాదు. వారికి భావోద్వేగాలు ఉంటాయి.'అని గవాస్కర్ పేర్కొన్నాడు.