ఒలింపిక్స్ చరిత్రలోనే అథ్లెటిక్స్ విభాగంలో వరుసగా స్వర్ణం, రజతం సాధించిన తొలి క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్.. భారత్కు వరుసగా 8 బంగారు పతకాలు అందించాడు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అసాధారణ రికార్డులతో ప్రపంచావ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
కపిల్ దేవ్ తొలి వన్డే ప్రపంచకప్ అందించగా.. మహేంద్ర సింగ్ ధోనీ మరో రెండు ప్రపంచకప్ల్లో భారత్ను విజేతగా నిలబెట్టాడు. రోహిత్, కోహ్లీ ఈతరం అత్యుత్తమ క్రికెటర్లుగా అభిమానుల ప్రేమలను పొందుతున్నారు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు వరుసగా రెండు పతకాలు గెలవగా.. షూటర్ అభినవ్ బింద్రా వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు.

అయితే వీరందరికంటే బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె.. తన దృష్టిలో భారత అత్యుత్తమ క్రీడాకారుడని టీమిండియా దిగ్జజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. 'నా దృష్టిలో ప్రకాశ్ పదుకొణె భారత అత్యుత్తమ క్రీడాకారుడు. ఇతర క్రీడా దిగ్గజాలు, ఇతర క్రీడల ఛాంపియన్స్ అంటే నాకు గౌరవం ఉంది. ప్రకాశ్ పదుకొణె నైపుణ్యమే కాదు.. బ్యాడ్మింట్లో అతను సాధించిన విజయాలతో పాటు ప్రవర్తన నా దృష్టిలో ప్రకాశ్ పదుకొణెను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
అప్పట్లో సర్వ్ చేస్తున్నప్పుడు మాత్రమే పాయింట్ ఇచ్చేవారు. ఇప్పడు ప్రత్యర్థి సర్వ్ చేస్తున్నప్పుడు కూడా పాయింట్ సాధించవచ్చు. అలాంటి కఠిన నిబంధనల మధ్యే ప్రకాష్ పదుకొణె సత్తా చాటాడు. ఆ సమయంలో డెన్మార్క్, చైనా షట్లర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించేవారు. అలాంటి వారిని ప్రకాష్ పదుకొణె మట్టికరిపించాడు. కేవలం 7-10 పాయింట్స్ మాత్రమే ప్రత్యర్థులకు సమర్పించుకునేవాడు. 'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా ప్రకాష్ పదుకొణె సాధించిన విజయాలను కూడా గవాస్కర్ గుర్తు చేశాడు. ఇక ప్రకాష్ పదుకొణె 1980లో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్ గెలవడంతో పాటు అదే ఏడాది బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. 1983 వరల్డ్ ఛాంపియన్షిప్స్లో బంగారు కాంస్య పతకం, 1981 ప్రపంచకప్లో బంగారు పతకం గెలిచాడు. 1978 కామన్వెల్త్ గేమ్స్లోనూ బంగారు పతకం గెలిచాడు.
ప్రస్తుతం 69 ఏళ్ల వయసులోనూ భారత బ్యాడ్మింటన్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. భారత షట్లర్లతో కలిసి పారిస్ ఒలింపిక్స్లోనూ పాల్గొన్నాడు. లక్ష్యసేన్ సెమీఫైనల్ చేరడంలో ప్రకాశ్ పదుకుణె కీలక పాత్ర పోషించాడు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె అతని కూతురు.