భారత్ చేతిలో చిత్తయిన పాకిస్థాన్ జట్టుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. ప్రస్తుత పాకిస్థాన్ జట్టు పనికి మాలిన టీమ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులే చేసింది. భారత స్పిన్నర్లను ఎదుర్కోలేకపోయిన పాక్ బ్యాటర్లు మొత్తం 63 డాట్ బాల్స్ ఆడారు. ఓ దశలో పాకిస్థాన్ 100 పరుగుల్లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. చివర్లో షాహీన్ షా అఫ్రిది దూకుడుగా గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన గవాస్కర్.. పాకిస్థాన్ ఆట ఆ జట్టు స్థాయికి తగ్గట్లు లేదన్నాడు. 'అజయ్ జడేజా, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ నాతో ఏకీభవిస్తారో లేదో తెలియదు. కానీ నేను 1960 నుంచి పాకిస్థాన్ జట్టును గమనిస్తున్నాను. హనీఫ్ మొహమ్మద్ వంటి గొప్ప ఆటగాడిగా చూడటానికి నేను చర్చ్గేట్ స్టేషన్ నుంచి వాంఖడే స్టేడియం వరకు పరుగెత్తిన జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెట్ను నేను నిశితంగా చూస్తున్నాను. కానీ ఈ రోజు మొదటి సారి ఇది పాకిస్థాన్ జట్టు కాదనిపించింది. ఇదో పనికిమాలిన జట్టులా అనిపించింది.'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
గవాస్కర్ వ్యాఖ్యలతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఏకీ భవించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను రీడ్ చేయడంలో పాకిస్థాన్ యువ బ్యాటర్లు విఫలమయ్యారని చెప్పాడు. 63 బంతులు డాట్ చేశారని, అక్కడే మ్యాచ్ పోయిందని అభిప్రాయపడ్డాడు.