న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు, సెంచరీల కోసం తప్పా వెస్టిండీస్ పర్యటన వల్ల జట్టుకు ఒరిగేదేం లేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న టీమిండియా.. వచ్చే నెల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్ టీమ్తో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
ఈ పర్యటన ఉద్దేశించి సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు ఈ టూర్ను ఎందుకు ఏర్పాటు చేశారో తనకు అర్థం కావడం లేదన్నాడు. 'ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు మునుపటిలా లేదు. గత రెండు దశాబ్దాలుగా వారి ప్రదర్శన దిగజారుతూ వచ్చింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్స్ అయిన ఆ జట్టు ఇప్పుడు జింబాబ్వేలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఆడుతోంది.

అలాంటి జట్టుపై సీనియర్లను సెలక్ట్ చేయడం అర్థం లేని విషయం. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విఫలమైన సీనియర్లు, వెస్టిండీస్ పర్యటనలో సెంచరీలు చేసి తాము మొనగాళ్లమని, ఫామ్లో ఉన్నామని నిరూపించుకోవడానికే ఈ సిరీస్ పెట్టినట్టు ఉంది.
వెస్టిండీస్లో సెంచరీలు చేసినా, వికెట్ల మీద వికెట్లు తీసుకున్నా.. అవి ఆటగాళ్ల వ్యక్తిగత గణాంకాలు మెరుగుపర్చుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావు. వచ్చే ఆరు నెలలు టీమిండియా బిజి బిజీగా గడపబోతోంది. అందుకని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లకు వెస్టిండీస్ పర్యటన నుంచి విశ్రాంతి కలిగించి ఉంటే బాగుండేది.వారి స్థానాల్లో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే సరిపోయేది. ప్రపంచకప్కు ఉపయోగపడే సిరీస్లు పెట్టకుండా పనికిరాని ఈ పర్యటనలు ఎందుకు?'అని సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు.
జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుండగా.. వన్డే, టెస్ట్ టీమ్లను బీసీసీఐ ప్రకటించింది. టెస్ట్ల్లో సంచలన నిర్ణయాలు తీసుకున్న సెలెక్టర్లు.. వన్డే టీమ్లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన ఉమేశ్ యాదవ్, చతేశ్వర్ పుజారాలపై వేటు వేసిన సెలెక్టర్లు.. రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ను జట్టులోకి తీసుకున్నారు.