ముంబై: అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇతర దేశాలను బెదిరిస్తోందని, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ దీటైన సమాధానం ఇచ్చారు. ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ 2026లో ఇంగ్లండ్ను ఓడించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనను ఉదహరిస్తూ నాజర్ హుస్సేన్కు చురకలంటించాడు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ వ్యవహారంలో భారత్కు ఐసీసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని నాజర్ హుస్సేన్ ఆరోపించాడు, 'బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడం తప్పు. ఇదే అభ్యర్థనను భారత్ చేసి ఉంటే ఐసీసీ అంగీకరించేది.’ అని అన్నారు. అయితే నాజర్ హుస్సేన్ పేరును ప్రస్తావించకుండానే, అతని వ్యాఖ్యలను ఖండిస్తూ సునీల్ గవాస్కర్ తన కాలమ్లో ఘాటు విమర్శలు చేశారు.
'ప్రపంచ క్రికెట్లో భారత్ ఇప్పుడు శక్తివంతమైన స్థానాన్ని దక్కించుకోవడాన్ని, కొన్ని పాత ఆధిపత్య శక్తులు (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే భారత్ ఏం చేసినా అందులో తప్పులు వెతుకుతున్నాయి. వారు ఈర్ష్యతో విమర్శలు గుప్పిస్తున్నారు" అని గవాస్కర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. భారత విజయాలను విమర్శల కోణంలో చూడడం వారి పక్షపాత దృక్పథాన్ని సూచిస్తోందని ఆయన స్పష్టం చేశారు

గత చరిత్రను గుర్తుచేస్తూ గవాస్కర్, 2003 ప్రపంచ కప్లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించారు. "జింబాబ్వేలో ఆడటానికి ఇంగ్లండ్ నిరాకరించింది. అది భద్రతా కారణాలతో కాదు, ఆ దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే విధానాలు నచ్చని కారణంగానే ఆడమని అన్నారు. అదెంత హాస్యాస్పదమైన కారణం? అప్పుడు ఐసీసీ ఇంగ్లండ్పై చర్య తీసుకుందా? లేదు.
ఆ సమయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డులే ఐసీసీని ప్రభావితం చేశాయి. ఇప్పుడు భారత్ ఆధిపత్యం చెలాయిస్తున్నందుకు వారు కపటత్వాన్ని ప్రదర్శిస్తున్నారు" అని గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సంఘటన వారి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని గవాస్కర్ నొక్కి చెప్పారు.
పాకిస్తాన్ వివాదం గురించి మాట్లాడుతూ, "గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోనే, పాకిస్థాన్కు రామని భారత్ చాలా స్పష్టంగా, ముందుగానే తెలియజేసింది. షెడ్యూల్ విడుదల కాకముందే భారత్ ఈ విషయాన్ని చెప్పింది. భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ప్రపంచం మొత్తానికి తెలుసు" అని గవాస్కర్ వివరించారు. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన గుర్తు చేశారు.
బీసీసీఐ ఇతరులను బెదిరిస్తోందని వస్తున్న ఆరోపణలపై గవాస్కర్, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఆటతీరును ఉదాహరిస్తూ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. "నిజమైన బెదిరింపు అంటే ఏమిటో తెలుసా? గత వారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లండ్ బౌలర్లను ధ్వంసం చేసి 80 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. అదే నిజమైన బెదిరింపు" అని అన్నారు.
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో ఇంగ్లండ్ను భయపెట్టిన విధానం అద్భుతమని కొనియాడారు. 'వైభవ్ విధ్వంసాన్నే ఆధిపత్యం అని పిలవాలి. బీసీసీఐ పరిపాలనపరంగా చేస్తున్న పనులను ఊహాజనితంగా బెదిరింపులుగా అభివర్ణించడం మానుకోండి" అని గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. మైదానంలో భారత యువ ఆటగాళ్లు చూపే ఆధిపత్యమే ప్రపంచం చూడాలని ఆయన ఆకాంక్షించారు.
పరిపాలనాపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దని గవాస్కర్ తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు. క్రీడలో నిజమైన శక్తి మైదానంలోనే ఉంటుందని, అంతకు మించి అవాస్తవ ఆరోపణలు సరైనవి కాదని ఆయన స్పష్టం చేశారు.