టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్(2) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. ఇంగ్లండ్తో ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైన ఆఖరి టెస్ట్లో యశస్వి జైస్వాల్ ఆదిలోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. గస్ అట్కిన్సన్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. సెంచరీతో ఈ సిరీస్ను ప్రారంభించిన యశస్వి జైస్వాల్.. నిలకడగా రాణించలేకపోయాడు. అయితే యశస్వి జైస్వాల్ బ్యాటింగ్లో టెక్నికల్ లోపం ఉందని, దాంతోనే ఔటవుతున్నాడని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. సోనీ స్పోర్ట్స్ ఛానెల్లో యశస్వి జైస్వాల్ ఔటైన తీరు గురించి మాట్లాడిన లిటిల్ మాస్టర్.. అరౌండ్ద వికెట్ బాల్స్కు ఇబ్బంది పడుతున్నాడని తెలిపాడు.
'యశస్వి జైస్వాల్ ఆటలో కొద్దిగా అనిశ్చితి కనిపిస్తోంది. బహుశా అతని ఆత్మవిశ్వాసం లోపించినట్లుంది. తొలి టెస్ట్లో సెంచరీ చేసిన తర్వాత అతను నిలకడగా రాణించలేకపోయాడు. దాంతో అతను తన ఫ్రంట్ ఫుట్ను వేగంగా ముందుకు తీసుకురాలేకపోతున్నాడు. కానీ అతను అద్భుతమైన ఆటగాడు. అయితే అతనితో ఎవరైనా కూర్చొని బ్యాటింగ్లో సాంకేతిక లోపాలను సరిదిద్దాలి. ముఖ్యంగా అతని ఫ్రంట్ ఫుట్ను ముందుకు తీసుకురావడం, భుజాన్ని ఎక్కువ ఓపెన్ చేయకుండా ఉంచడం వంటి వాటిని సరిచేయాలి. ప్రస్తుతం అతను వెనుక భుజం ఫస్ట్ స్లిప్, సెకండ్ స్లిప్ వైపు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో బ్యాట్ను నేరుగా కిందకు తీసుకురావడం కష్టతరం అవుతుంది. అతని భుజం వికెట్ కీపర్, ఫస్ట్ స్లిప్ వైపు ఎక్కువగా ఉంటే బ్యాట్ మరింత కిందకు తీసుకురావచ్చు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్లో యశస్వి జైస్వాల్ 9 ఇన్నింగ్స్ల్లో 32.55 సగటుతో 293 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(2), కేఎల్ రాహుల్(14) పెవిలియన్ చేరారు. అట్కిన్సన్ బౌలింగ్లో జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపేసిన అంపైర్లు.. నిర్ణీత సమయం కన్నా ముందే లంచ్ బ్రేక్ ప్రకటించారు. దాంతో భారత్ 23 ఓవర్లలో 72/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
గంట విరామం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. ఆదిలోనే శుభ్మన్ గిల్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ వెంటనే మరోసారి వర్షం రావడంతో టీమిండియా 85/3 స్కోర్తో మైదానం వీడింది. వర్షం భారీగా పడటం, ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో దాదాపు రెండు గంటలు అంతరాయం కలిగింది. అనంతరం రెండో సెషన్ను ముగించిన అంపైర్లు ఆఖరి సెషన్ను మొదలుపెట్టారు.
సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ నిలకడగా రాణించే ప్రయత్నం చేశారు. కానీ సాయి సుదర్శన్(38)ను జోష్ టంగ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే రవీంద్ర జడేజా(9) టంగ్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్ సైతం(19) నిరాశపర్చాడు. క్రీజులోకి వచ్చిన సుందర్, కరుణ్ నాయర్ పోరాడుతున్నారు.