
న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టు కోసం ఎదురుచూసిన అభిమానులకు, విశ్లేకులకు బీసీసీఐ ఊహకందని ఆనందాన్ని కలిగించింది. వరల్డ్కప్ విజయం సాధించడమే లక్ష్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని జట్టులోకి తీసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసింది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహీ.. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు మెంటార్గా పనిచేయనున్నాడు. ఐసీసీ ఈవెంట్స్లో కెప్టెన్గా ధోనీకి మంచి రికార్డు ఉండటంతోనే జట్టు మార్గదర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని దిగ్గజ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్వాగతించాడు.
అయితే హెడ్ కోచ్ రవిశాస్త్రితో విభేదాలు తలెత్తితే మాత్రం జట్టుకు తీరని నష్టం జరుగుతుందని, ఈ ఒక్క విషయం మినహా మెంటార్గా ధోనీ జట్టుకు లాభపడుతాడన్నాడు. ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీకి సాటిలేరని, అతని విలువైన సలహాలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయన్నాడు. '2004లో టీమిండియా జట్టుకు మెంటార్గా నేను ఎంపికైనప్పుడు జాన్ రైట్(నాటి భారత జట్టు కోచ్) కాస్త దిగులుగా కనిపించారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసే ఆలోచనలో నేను ఉన్నానని అనుకున్నారు. కాబట్టి మెంటార్కు, కోచ్కు ఏకాభిప్రాయాలు ఉండటం చాలా ముఖ్యం.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
రవిశాస్త్రి, ధోనీ ఏకాభిప్రాయంతో పనిచేస్తే టీ20 ప్రపంచకప్లో టీమిండియా మంచి ఫలితాలు సాధిస్తుందని గావస్కర్ పేర్కొన్నాడు. 'కోచ్ అవ్వాలనే ఆసక్తి ధోనీకి లేదని రవిశాస్త్రికి తెలుసు. శాస్త్రి, ధోనీ కలిసికట్టుగా ఉంటే జట్టుకు లాభం జరుగుతుంది. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వస్తే జట్టుపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ధోనీ మెంటార్గా ఉండటం వల్ల జట్టుకు ఎంతో బలం చేకూరుతుందనే చెప్పొచ్చు.'అని దిగ్గజ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక రవిశాస్త్రి, ధోనీ ఒకే నిర్ణయంపై పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
మెంటార్గా ధోనీని నియమించిన విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. ''ప్రపంచకప్లో భారత జట్టుకు ధోనీ మెంటార్గా ఉంటాడు. ఈ విషయంపై దుబాయ్లో అతనితో చర్చించాను. ప్రపంచకప్ వరకే ఆ పదవిలో ఉండేందుకు అతను అంగీకరించాడు. ఆ తర్వాత నేను సహచరులతో కూడా మాట్లాడా. మా అందరిదీ ఒకే అభిప్రాయం. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా మాట్లాడా. ధోనీ జట్టుతో ఉండేందుకు అంతా అంగీకరించారు'' అని జట్టును ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో షా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును బుధవారం సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్లకు చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చాడు.