ముంబై ఇండియన్స్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ఉంటారని దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి ముంబై ఇండియన్స్ తప్పించిన విషయం తెలిసిందే.
గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్గా ప్రకటించింది.
ఈ నిర్ణయంపై రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. కొందరైతే ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియా ఖాతాలను అన్ఫాలో చేశారు. సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై దుమారమే రేగింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై సునీల్ గవాస్కర్ స్పందించాడు.

హార్దిక్ పాండ్యా ఫలితాలు సాధిస్తుండటంతోనే అతనివైపు మొగ్గు చూపి ఉండవచ్చని తెలిపాడు. ఈ నిర్ణయం కారణంగా ముంబై ఇండియన్స్కు ఎలాంటి నష్టం జరగదని, ప్రయోజనమే ఉంటుందని సునీల్ గవాస్కర్ తెలిపాడు.
'మనం తప్పొప్పుల జోలికి వెళ్లకూడదు. కానీ, జట్టుకు ప్రయోజనం చేకూర్చడం కోసమే వారు ఆ నిర్ణయాన్ని తీసుకొని ఉంటారు. గత రెండేళ్లుగా రోహిత్ శర్మ బ్యాటింగ్లో కాస్త వెనుకబడ్డాడు. అంతకుముందు సీజన్లలో అతను పెద్ద స్కోర్లు చేశాడు. గత రెండు సీజన్లలో ముంబై టైటిల్ గెలవలేదు. ఐపీఎల్ 2022 సీజన్లో అయితే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
ఈ ఏడాది ప్లే ఆఫ్స్కి మాత్రమే పరిమితమైంది. తీరికలేని క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ కాస్త అలసిపోయి ఉండొచ్చు. హార్దిక్ పాండ్యా యువ కెప్టెన్గా మంచి ఫలితాలు సాధిస్తుండటంతో అతన్ని సారథి చేయాలని ముంబై భావించి ఉండొచ్చు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ను రెండు సార్లు ఫైనల్ తీసుకెళ్లడమే కాకుండా.. అరంగేట్ర సీజన్లోనే టైటిల్ అందించాడు.
ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్గా చేసిందనుకుంటున్నా. ఈ నిర్ణయంతో ముంబై ఇండియన్స్కు నష్టం ఉండదు. ప్రయోజనమే ఉంటుందని భావిస్తున్నా.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.