సౌతాఫ్రికాతో ఘోర పరాజయం అనంతరం టీమిండియా మేనేజ్మెంట్, సెలెక్టర్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా.. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం వారికి మద్దతు తెలిపాడు. ప్రస్తుతం జట్టు సంధి దశలో ఉందని తెలిపారు. దాంతోనే ఆశించిన ఫలితం దక్కలేదని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉంటే ఫలితం మరోలా ఉండేదనే వాదనను తప్పుబట్టారు. కోహ్లీ, రోహిత్ జట్టులో ఉన్నా ఇదే ఫలితం పునరావృతమయ్యేదని నొక్కి చొప్పాడు.
సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా రెండు సిరీస్ల్లో క్లీన్ స్వీప్ కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లు రోహిత్, కోహ్లీ, అశ్విన్లను ఇంకొన్నాళ్లు జట్టులో కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డారు.
అయితే ఈ వాదనను గవాస్కర్ తప్పుబట్టాడు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ ఉండగానే న్యూజిలాండ్ చేతిలో 3-0తో టీమిండియా క్లీన్ స్వీప్ అయిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా టీమిండియా ఓడిపోయిందని చెప్పారు.

'రిటైర్మెంట్ అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. బహుషా.. టీమ్మేనేజ్మెంట్ వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెప్పవచ్చు. కానీ వారు జట్టులో ఉంటే భారత్ గెలిచేది అనే వాదన సరికాదు. ఎందుకంటే న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయినప్పుడు వారు భారత జట్టులోనే ఉన్నారు. వారు ఉండగానే భారత్ 0-3తో చిత్తయ్యింది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ సిరీస్ కోల్పోయింది. రిటైర్మెంట్ తీసుకునేలా చేశారా? అనే ఆలోచనే చేయవద్దు. అది సరైన పద్దతి కూడా కాదు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచకప్ టోర్నీలు జరగనున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయం సరికాదని బోర్డు భావిస్తుందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 'గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవట్లేదు. ప్రస్తుతం భారత జట్టు ట్రాన్సిషన్ దశలో ఉంది. వచ్చే రెండేళ్లలో టీ20 ప్రపంచకప్ 2026, వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీలు జరగనున్నాయి. సౌతాఫ్రికాతో వైట్వాష్ గురవ్వడంపై టీమ్ మేనేజ్మెంట్తో పాటు సెలెక్టర్లతో బీసీసీఐ మాట్లాడనుంది. వారి నుంచి వివరణ కోరనుంది.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.