కొత్త సారథి నాయకత్వంలో పాత కెప్టెన్లు సరిగ్గా ఆడరనే వాదనను టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. ఇది అపోహ మాత్రమేనని, ఇలా ఎవరూ ఆడరని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ నుంచి టీమిండియా వన్డే సారథ్య బాధ్యతలను శుభ్మన్ గిల్ అందుకున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్తో శుభ్మన్ గిల్ వన్డే సారథ్యం మొదలవ్వగా.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. దాంతో కొత్త కెప్టెన్ నాయకత్వంలో పాత సారథి ఆడకపోవడం కొత్త కాదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.
ఈ వాదనపై తాజాగా మాట్లాడిన గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ఇలా ఏ ఆటగాడు చేయడని స్పష్టత ఇచ్చాడు. 'గత కొన్నేళ్లుగా భారత అభిమానులకు ఓ అపోహ ఉంది. కొత్త సారథి నాయకత్వంలో పాత కెప్టెన్ సరిగ్గా ఆడడని భావించడం అలవాటుగా మారిపోయింది. తమ అత్యుత్తమ క్రికెట్ను ప్రదర్శించకుండా నూతన కెప్టెన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ కామెంట్స్ చేస్తారు. వారికి నిజంతో పనిలేదు. అసలు వాస్తవం ఏంటంటే.. కెప్టెన్సీ మార్చాక అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వకపోతే జట్టులో నుంచి తప్పిస్తారని కూడా ఆటగాడికి తెలుసు. అలాంటప్పుడు సారథ్యం కోల్పోయినందుకు ఎంత బాధపడినా.. ఏ ఆటగాడు కూడా ఉద్దేశపూర్వకంగా సరిగ్గా ఆడకుండా ఉండడు.

ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను నయా కెప్టెన్గా శుభ్మన్ గిల్ హ్యాండిల్ చేయగలడా? చాలా మందికి ఉన్న సందేహం. వన్డే సిరీస్కు ముందే శుభ్మన్ గిల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. కెప్టెన్గా వచ్చినా సరే వారిద్దరితో తన సంబంధాలు ఎప్పటిలానే కొనసాగుతాయని తెలిపాడు. అవసరమైనప్పుడు వారి సూచనలు, సలహాలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయనని కూడా చెప్పాడు. ఈ ఇద్దరి వల్ల గిల్కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. అత్యుత్తమ వన్డే ప్లేయర్లు జట్టులో ఉంటే కెప్టెన్కే లాభం.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.