టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. హెడ్ కోచ్గా గంభీర్ పనితీరు గురించి టీమిండియా సాధించిన ఫలితాలే మాట్లాడుతాయని అసహనం వ్యక్తం చేశాడు. హెడ్ కోచ్గా గంభీర బాధ్యతలు చేపట్టిన 6 నెలల కాలంలోనే భారత్ రెండు ఘోర పరాజయాలు మూట గట్టుకుందని, ఈ ఫలితాలను బట్టే గంభీర్ పనితీరును అర్థం చేసుకోవచ్చన్నాడు.
గంభీర్ పర్యవేక్షణలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్ గెలిచి వన్డే సిరీస్ కోల్పోయింది. సుదీర్ఘ కాలం తర్వాత శ్రీలంక చేతిలో ద్వైపాక్షిక సిరీస్ను కోల్పోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్తో టెస్ట్, టీ20 సిరీస్ గెలిచినా.. న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్కు గురైంది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్కు గురవ్వడం ఇదే తొలిసారి.

ఈ పరాజయం అనంతరం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పనితీరుపై గవాస్కర్ను ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారత కోచింగ్ టీమ్ గురించి జట్టు సాధించిన ఫలితాలే మాట్లాడుతాయి. శ్రీలంకలో సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్కు గురై ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఫలితాలే వారి పని తీరును చెబుతున్నాయనుకుంటున్నా. ఈ పరాజయాలకు టీమిండియా మేనేజ్మెంట్ బాధ్యత తీసుకోవాలి.
ప్రతీ జట్టుకు నిర్ణయాలు తీసుకునే టీమ్ ఉంటుంది. ఇందులో కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ ఉంటారు. ఈ ముగ్గురు కలిసి జట్టుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వర్కౌట్ కాకపోతే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి. ఈ ఓటములకు కూడా టీమిండియా మేనేజ్మెంటే తీసుకున్న నిర్ణయాలే కారణమని నేను భావిస్తున్నా.
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై కూడా వేటు పడుతోంది. బ్యాటింగ్లో సత్తా చాటకపోతే ఈ సీనియర్ ఆటగాళ్లను కూడా పక్కనపెట్టి కుర్రాళ్లతో కూడిన జట్టును ఇంగ్లండ్కు పంపిస్తారు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు బీసీసీఐ అధికారులు సైతం టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకపోతే రోహిత్, కోహ్లీల కెరీర్లకు ఎండ్ కార్డ్ పడుతుందనే సంకేతాలు ఇచ్చారు. 'భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించకపోతే... సూపర్ సీనియర్స్ అంతా జట్టుకు దూరమవుతారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టుకు ఎంపికవ్వరు. అదే జరిగితే నలుగురు సీనియర్లు సొంతగడ్డపై చివరి టెస్ట్ ఆడినట్లే.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు.