అసూయతోనే ఇంగ్లండ్ ఆటగాళ్లు స్లెడ్జింగ్కు దిగారని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయకపోవడంతో వారు అసూయకు లోనయ్యారని చెప్పాడు. ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన ఐదు టెస్ట్ల సిరీస్ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది.
ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు సహనం కోల్పోయారు. తమ నోటికి పనిచెప్పారు. జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్ స్టో వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా భారత కుర్రాళ్లపై స్లెడ్జింగ్కు దిగారు. వారికి అదే రీతిలో భారత ఆటగాళ్లు బదులిచ్చారు. జేమ్స్ అండర్సన్- శుభ్మన్ గిల్, జానీ బెయిర్ స్టో-సర్ఫరాజ్ ఖాన్ల మధ్య మాటల తూటాలు పేలాయి.

ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన గవాస్కర్.. అసూయతోనే అలా మాట్లాడారని తెలిపాడు. 'ఈ సిరీస్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు తరుచుగా భారత జట్టు సభ్యులతో వాగ్వాదాలకు దిగడం మనమంతా చూశాం. అయితే టెస్ట్ సిరీస్ ఓడిపోయారనే బాధలో వారు అలా చేయలేదు.
ఐపీఎల్ ఫ్రాంచైజీలు పట్టించుకోలేదనే అసహనంతో అలా ప్రవర్తించారు. ఇంగ్లండ్ బోర్డు ఎప్పుడు వారిని వెనక్కి రమ్మటుందో తెలియదు. అందుకే ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేసే విషయంలో వెనకడుగు వేసాయి. కానీ అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించని ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో కోట్లు ఆర్జిస్తున్నారు. దాంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు అసూయకు లోనయ్యారు.
భారత ఆటగాళ్ల ఐపీఎల్ క్యాష్ డీల్స్ను జీర్ణించుకోలేకపోయారు. దాంతోనే భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్నారు. ఈ కోణంలో చూస్తే ఇంగ్లండ్పై భారత్ సిరీస్ విజయానికి మరింత విలువ పెరుగుతుంది. ఐపీఎల్లో ఆసీస్ ఆటగాళ్ల కంటే ఇంగ్లండ్ ప్లేయర్ల ఆధిపత్యం చాలా తక్కువ. ఐపీఎల్ ద్వారా ఆసీస్ ఆటగాళ్లు పేరుతో పాటు డబ్బులు సంపాదిస్తున్నారు. 'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.