టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ వైఫల్యం కొనసాగుతోంది. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో సంజూ విఫలమయ్యాడు. బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ అతను తీవ్రంగా నిరాశపర్చాడు. 24 పరుగులే చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే అతను ఔటైన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది.
సంజూ ఆటతీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతని బ్యాటింగ్ లోపాల గురించి ఎవరైన చెప్పాలని మేనేజ్మెంట్కు సూచించాడు. అతని ఫుట్వర్క్ సరిగ్గా లేకనే ఔటయ్యాడని అభిప్రాయపడ్డాడు.
'సంజూ ఆడిన షాట్లో ఫుట్ వర్క్ లేదు. బంతి అనూహ్యంగా టర్న్ కూడా కాలేదు. అతను వికెట్ల ముందు నిల్చొని పక్కకు జరిగి ఆఫ్ సైడ్ ఆడాలని చూశాడు. కానీ పాదాల్లో ఏ మాత్రం కదలిక లేదు. ఉన్నచోట ఉండే షాట్ కొట్టాలనుకున్నాడు. వికెట్లు మొత్తం వదిలేసి నిలబడ్డాడు. ఇలాంటి సమయాల్లో బంతి బ్యాట్ను మిస్సైతే నేరుగా వికెట్లను గిరాటేస్తుంది. సంజూ శాంసన్ విషయంలో ఇలా రెండో సారి జరిగింది. అతనికి ఎవరైన ఈ విషయాలు వివరించాలి. ఈ లోపాలను సరిదిద్దుకోమని చెప్పాలి'అని సునీల్ గవాస్కర్ విశ్లేషించాడు.

టీ20 ప్రపంచకప్ 2026 ముందు సంజూ శాంసన్ వైఫల్యం ఆందోళనకు గురి చేస్తోంది. గాయంతో జట్టుకు దూరమైన తిలక్ వర్మ అందుబాటులోకి వస్తే సంజూ శాంసన్పై వేటు పడే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్లో చెలరేగి భారత జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్.. తిలక్ వర్మ గైర్హాజరీలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. సంజూ శాంసన్ ఈ సిరీస్లో వరుసగా 10, 6, 0, 24 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు మ్యాచ్ల్లో కలిపి కనీస 50 పరుగులు కూడా చేయలేకపోయాడు.
శనివారం తిరువనంతపురం వేదికగా జరిగే ఆఖరి టీ20లో సంజూ శాంసన్కు చివరి అవకాశం ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్లో కూడా రాణించకపోతే టీ20 ప్రపంచకప్ 2026లో అతను పూర్తిగా బెంచ్కే పరిమితం కానున్నాడు.