అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం సరికాదని, సిరీస్ ముగిసిన తర్వాత వీడ్కోలు పలకాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చివరి రోజు ఆట అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. అంతర్జాతీయ క్రికెటర్గా ఇదే తనకు చివరి రోజు అని పేర్కొన్నాడు.

అశ్విన్ రిటైర్మెంట్పై స్పందించిన గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం సరికాదు. 2014-15 పర్యటనలోనూ మూడో టెస్ట్ అనంతరం ధోనీ ఇలానే రిటైర్ అయ్యాడు. ఆ సమయంలో జట్టులో అతని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ పర్యటనకు సెలెక్షన్ కమిటీ చాలా మంది ఆటగాళ్లను ఎంపిక చేసిందంటే దానికి ఓ కారణం ఉంది. ఆటగాళ్లు ఎవరైన గాయపడితే రిజర్వ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా మందిని ఎంపిక చేశారు.
సిడ్నీ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారత్ ఇద్దరు స్పిన్నర్లతో ఆడాల్సి వస్తోంది. ఆ సమయంలో అశ్విన్ సేవలు జట్టుకు అవసరమయ్యేవి. మెల్ బోర్న్ పిచ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ సిరీస్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాల్సింది. ఇలా మధ్యలో తప్పుకోవడం సరికాదు.'అని గవాస్కర్ విమర్శించాడు.
ప్రస్తుతం జట్టులో జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. తొలి టెస్ట్లో సుందర్కు అవకాశం దక్కగా.. రెండో టెస్ట్లో అశ్విన్ బరిలోకి దిగాడు. మూడో టెస్ట్లో జడేజాకు చోటు దక్కింది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్లోనూ జడేజాకే చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించగా.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. దాంతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.