సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో టీమిండియా ఓడిపోవడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. దేశవాళీ క్రికెట్ ఆడకుండా ఇంట్లో పడుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయని విమర్శించాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా గత ఆదివారం(నవంబర్ 16) ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఛేదించలేకపోయారు. ప్రత్యర్థికి స్పిన్ ఉచ్చును బిగించాలని చూసిన టీమిండియా.. అదే ఉచ్చులో పడి ఓటమిపాలైంది. పూర్తిగా బౌలింగ్కు అనుకూలంగా ఉండే వికెట్ను తయారు చేసుకొని మూల్యం చెల్లించుకుంది. దాంతో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరాజయంపై స్పందించిన గవాస్కర్.. భారత బ్యాటర్లు స్పిన్ ఆడకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. గతంలో తాను చెప్పినట్లుగానే భారత బ్యాటర్లు దేశవాళీ క్రికెట్ ఆడటం లేదని, దాంతోనే స్పిన్ బౌలింగ్ను ఆడలేకపోతున్నారని చెప్పాడు. వరల్డ్ బెస్ట్ పేస్ బౌలింగ్ను ఎదుర్కోంటున్న భారత బ్యాటర్లు.. స్పిన్కు మాత్రం బెంబేలెత్తిపోతున్నారని విమర్శించాడు.

'మన జట్టులోని చాలా మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడారు. డొమెస్టిక్ క్రికెట్ ఆడితే ఈ రకమైన స్పిన్ పిచ్లపై ఆడగలిగే సామర్థ్యం వస్తుంది. ఎందుకంటే దేశవాళీ స్థాయిలో కూడా జట్లు తీవ్రంగా పోటీ పడుతాయి. రంజీ ట్రోఫీ నాకౌట్కు అర్హత సాధించేందుకు కావాల్సిన పాయింట్ల కోసం శ్రమిస్తాయి. దేశవాళీ క్రికెట్లో ర్యాంక్ టర్నర్ పిచ్లు ఉంటాయి. కానీ మన ఆటగాళ్లు ఎవరూ దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. వాస్తవానికి మన ప్రస్తుత జట్టులో ఎంతమంది రంజీ ట్రోఫీ ఆడేందుకు ఇష్టంగా ఉన్నారు? ఎవరికీ ఇష్టం లేదు. ఎందుకంటే వారికి వర్క్లోడే అనే పదం ఒకటి సాకుగా ఉంది.
వర్క్లోడ్ను సాకుగా చూపిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫామ్ కోల్పోతేనే వారికి రంజీ క్రికెట్ గుర్తుకొస్తుంది. అంతే తప్పా ఎవరికి కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని లేదు. టర్నింగ్ పిచ్లతో విజయాలు సాధించాలని టీమ్మేనేజ్మెంట్ భావించవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లను ఎంచుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు ఇలాంటి పిచ్లపై ఆడే దమ్ములేదు. ఎందుకంటే వారికి ఇలాంటి పిచ్లపై ఆడిన మ్యాచ్ ప్రాక్టీస్ లేదు.'అని గవాస్కర్ విమర్శలు గుప్పించాడు.
ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ గౌహతి వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరి ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్కు సమతూకమైన పిచ్ను తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్కు కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరం కానున్నాడు. అతని స్థానంలో సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.