
న్యూఢిల్లీ: బ్యాటింగ్.. కీపింగ్లో కేఎల్ రాహుల్ రాణించినా యువప్లేయర్ రిషబ్పంత్నే కీపర్గా కొనసాగించాలని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఈ యువ ఆటగాడికి ఉందని, అతన్నే కీపర్గా కొనసాగించాలని ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ టీమ్మేనేజ్మెంట్కు సూచించాడు.
'లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో రిషభ్ పంత్నే కీపర్గా ఎంచుకుంటాను. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఫినిషర్గా పంత్ జట్టుకు విజయాలందించగలడు. అంతేకాకుండా అతడు ఎడమచేతివాటం బ్యాట్స్మన్. ఇండియా బ్యాటింగ్ లైనప్లో శిఖర్ ధావన్ మినహా ఎవరూ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ లేరు. మరో ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ఉంటే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే పంత్ను తీసుకోవాలి.'అని ఈ లెజెండర్ క్రికెటర్ కోహ్లీసేనకు సూచించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పంత్ గాయపడి కంకషన్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో కీపర్గా అవతారమెత్తిన రాహుల్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా వికెట్ల వెనుకాల ఎలాంటి తడబాటు లేకుండా పంత్కు మించి ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో అతని మార్క్ కీపింగ్తో లెజండరీ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని గుర్తుచేశాడు. అటు బ్యాటింగ్లోనూ జట్టు అవసరాలకు తగ్గట్టు చెలరేగాడు. తొలి వన్డేలో మూడో స్థానంలో వచ్చి 47 పరుగులు.. రెండో వన్డేలో ఐదో స్థానంలో వచ్చి 80 పరుగులు చేశాడు. ఇక మూడో మ్యాచ్లో ధావన్ గాయపడటంతో మళ్లీ ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్(19) భారీ స్కోర్ చేయకపోయినా.. రోహిత్తో కలిసి మంచి శుభారంభాన్ని అందించాడు.
ఇలా మల్టిపుల్ రోల్స్తో ఆకట్టుకున్న రాహుల్పై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపించారు. కెప్టెన్ కోహ్లీ అయితే రాహుల్ను మరిన్ని మ్యాచ్లు కీపర్గా కొనసాగిస్తామన్నాడు. అతను కీపింగ్ చేయడం వల్ల అదనపు బ్యాట్స్మన్ ఆడించే అవకాశం ఉంటుదని, జట్టు సమతూకంగా ఉంటుందని తెలిపాడు. దీంతో పంత్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు.. పంత్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా టీమ్మేనేజ్మెంట్ భరోసా కల్పించాలన్నాడు.