టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పరిస్థితుల్ని గౌరవించడం నేర్చుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. మూడు టెస్ట్లు ముగిసే సరికి 1-1తో సమంగా నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మూడు మ్యాచ్ల్లో రిషభ్ పంత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలోనే అతనికి గవాస్కర్ పలు సూచనలు చేశాడు.
'రిషభ్ పంత్ పరిస్థితులను గౌరవించడం నేర్చుకోవాలి. అతని ఆట దూకుడుగానే ఉంటుంది. ఈ విషయం నేను కాదనను. కానీ క్రీజులోకి వచ్చిన తొలి అరగంట పాటు పరిస్థితుల్ని, మంచి బంతుల్ని గౌరవించాలి. పంత్ బ్యాటింగ్కు వచ్చే సరికి భారత్ 500 పరుగులు దాటేసి ఉంటే ఆరంభంలోనే దూకుడుగా ఆడటం తప్పు కాదు. కానీ క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచే ప్రతీ బంతిని బాదాలనే రీతిలో బ్యాటింగ్ చేయకూడదు.

ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ అతన్ని ఇబ్బంది పెట్టారు. స్కాట్ బోలాండ్ సైతం పంత్ను కుదురుకోనివ్వలేదు. అరౌండ్ బాల్స్తో ఇబ్బంది పెట్టాడు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్ల్లో రిషభ్ పంత్ 19.20 సగటుతో 96 పరుగులే చేశాడు.
మరోవైపు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ మాత్రం రిషభ్ పంత్ తన ఫియర్లెస్ గేమ్ను కొనసాగించాలని సూచించాడు. అటాకింగ్ గేమ్ అతనితో పాటు టీమిండియాకు కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.
'రిషభ్ పంత్కు నేను పెద్ద అభిమానిని. అతనో విభిన్నమైన ఆటగాడు. అతని సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదు. అతను దూకుడుగా ఫియర్ లెస్ బ్యాటింగ్ చేయాలనే నేను కోరుకుంటాను. ఎందుకంటే అతను జట్టు మెరుగైన స్థితిలో ఉన్నప్పుడే బ్యాటింగ్కు వస్తాడు. కాబట్టి అటాకింగ్ గేమ్ అతనితో పాటు జట్టుకు కలిసొస్తుంది. రోహిత్ శర్మలాగా బౌలర్లపై విరుచుకుపడాలి. రిషభ్ పంత్ నుంచి అలాంటి ఇన్నింగ్స్లను ఈ సారి ఇంకా చూడలేదు. ఆసీస్ కండిషన్స్కు అతను భయపడాల్సిన అవసరం లేదు. అతను ఫియర్లెస్ గేమ్ ఆడితేనే భారత జట్టుకు మేలు జరుగుతుంది.'అని మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు.