
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) అండగా నిలిచాడు. వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వైఫల్యాన్ని మరిచిపోయి ఐపీఎల్లో చెలరేగాలని సూచించాడు. ప్రతీ ఆటగాడి కెరీర్లో ఇలా విఫలమవ్వడం సాధారణమని, ఎక్కువగా ఆలోచించకుండా పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చాడు. అలా చేస్తే వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని సూచించాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు గోల్డెన్ డకౌటైన విషయం తెలిసిందే.
తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఒకే తరహాలో ఎల్బీగా వెనుదిరిగిన సూర్య(Suryakumar Yadav).. చివరి వన్డేలో స్పిన్నర్ అష్టన్ అగర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సూర్యకు బదులు ఇతర ఆటగాడికి అవకాశమిచ్చినా జట్టుకు కలిసొచ్చేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శించారు.

ఈ క్రమంలోనే అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన గవాస్కర్ సూర్యకు అండగా నిలిచాడు.'సూర్యకుమార్ యాదవ్ మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్ అవడం బాధాకరమే. కానీ అతను తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏ ఆటగాడి కెరీర్లో అయినా జరిగేదే. ఈ వైఫల్యం గురించి ఎంత త్వరగా మరిచిపోతే అంత ఉత్తమం. మూడు గోల్డెన్ డకౌట్స్ గురించి మరిచిపోయి అప్కమింగ్ ఐపీఎల్ సీజన్ మీద సూర్య దృష్టిపెట్టాలి. ఐపీఎల్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి తద్వారా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఐపీఎల్ సూపర్ ఫామ్ సూర్యకు తర్వాత ఆడబోయే అంతర్జాతీయ మ్యాచ్లకు ఎంతో అవసరమవుతుంది.
ఐపీఎల్ ముగిసిన అనంతరం టీమిండియా వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఇది వరల్డ్ కప్ ఏడాదే అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సూర్య తన గేమ్ను తీర్చి దిద్దుకోవాలి. అప్పుడే వన్డే వరల్డ్ కప్ టీమ్లో సూర్య చోటు దక్కించుకోగలడు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సూర్యకు అండగా నిలిచాడు. ఈ సిరీస్లో సూర్య మూడు బంతులే ఆడటం దురదృష్టకరమని, మూడు అద్భుతమైన బంతులకు సూర్య ఔటయ్యాడని వెనకేసుకొచ్చాడు. వరుసగా గోల్డెన్ డకౌట్లు అయినంత మాత్రానా అతని సామర్థ్యం, నైపుణ్యాలు ఎక్కడికీ పోవని చెప్పాడు.

ముంబై క్రికెటర్ కావడంతోనే సూర్యకు రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్ అండగా నిలుస్తున్నారని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. సౌతిండియా ప్లేయరే ఇలా ఔటైతే.. గవాస్కర్ మరోలా మాట్లాడేవాడని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే.