వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు దుమ్మురేపారు. ఒకే రోజు రెండు స్వర్ణాలతో పాటు నాలుగు మెడల్స్ను గెలుచుకున్నారు. మంగళవారం జావెలిన్ త్రోలో రెండు బంగారు పతకాలు, ఒక రజతం రాగా.. డిస్కస్ త్రోలో యోగేశ్ కతూనియా రజతం సాధించాడు. పురుషుల ఎఫ్ 64 కేటగిరిలో సుమిత్ అంటిల్ జావెలిన్ను 71.37 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తానే సృష్టించిన ఛాంపియన్షిప్ రికార్డ్(2023లో 70.83 మీటర్లు)ను తుడిచిపెట్టాడు. ఈ టోర్నీలో పసిడి హ్యాట్రిక్ కూడా కొట్టాడు. 2023, 24 పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోనూ అతను స్వర్ణం సాధించాడు.
సుమిత్ అంటిల్ ముందుగా రెజ్లర్ కావాలనుకున్నాడు. కానీ 17 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను నడుపుతున్న బైక్.. ట్రక్ను ఢీకొనడంతో ఎడమ కాలిని తీసేయాల్సి వచ్చింది. దాంతో రెజ్లర్ కావాలనే కల చెదిరింది. కానీ క్రీడలపై ఉన్న మక్కువ పోలేదు. 2017లో పారా అథ్లెట్గా కెరీర్ ప్రారంభించాడు. జావెలిన్ త్రోలో పట్టు సాధించి ఈ క్రీడల్లో దూసుకెళ్తున్నాడు.

పురుషుల ఎఫ్ 44 జావెలిన్ త్రోలో సందీప్ సంజయ్ సర్గార్ స్వర్ణం.. సందీప్ సిల్వర్ మెడల్తో మెరిసారు. సంజయ్ 62.82 మీటర్ల త్రో వేయగా.. సందీప్ 62.67 మీటర్లు జావెలిన్ విసిరాడు. ఎడినిల్సన్(బ్రెజిల్) బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు.
మహారాష్ట్రకు చెందిన సందీప్ సంజయ్ నేపథ్యం భిన్నమైనది. నాలుగేళ్ల వయసులోనే ఒక ప్రమాదంలో అతడి కాలికి తీవ్ర గాయమైంది. ఆటపై ఆసక్తితో అతను పారా జావెలిన్వైపు అడుగేసాడు. ఆర్థికంగా అవరోధాలు ఎదురైనా.. సాధన మానలేదు.
ఒకవైపు పుణెలో డెలివరీ బాయ్గా పని చేస్తూనే శిక్షణ సాగించిన అతడు.. తొందరగానే ఆటపై పట్టు సంపాదించాడు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 2022లో ప్రపంచ పారా గ్రాండ్ప్రిలో పసిడి నెగ్గాడు. 2024 షార్జాలో జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రిలోనూ స్వర్ణంతో మెరిశాడు. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్లో తొలిసారి బరిలో దిగి పసిడితో సత్తా చాటాడు.