పోలీయాక్ ఇమ్రే-వర్గా జానోస్ మెమోరియల్ 2025 రెజ్లింగ్ టోర్నీలో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ స్వర్ణ పతకం సాధించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా గురువారం జరిగిన 65 కేజీల పురుషుల ఫ్రైస్టైల్ ఫైనల్లో సుజీత్ కల్కల్ 5-1 తేడాతో రహీమ్జాదేను ఓడించాడు. ఈ ఏడాది జరిగిన రెజ్లింగ్ ర్యాకింగ్ సిరీస్ల్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అమ్మాన్, మంగోలియా వేదికగా జరిగిన రెజ్లింగ్ టోర్నీల్లో భారత రెజ్లర్లు పతకాలు సాధించకుండానే వెనుదిరిగారు.
ఫైనల్లో సుజీత్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించాడు. తొలి పిరియడ్లోనే ఒక యాక్టివిటీ పాయింట్ సాధించిన సుజీత్.. రెండో పిరియడ్ పూర్తయ్యేసరికి రెండు యాక్టీవిటీ పాయింట్స్తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆఖరి వరకు ఇదే జోరును కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ టోర్నీలో సుజీత్ తొలి రౌండ్లో 11-0 తేడాతో పారిస్ 2024 ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ అల్బేనియా రెజ్లర్ ఇస్లాం దుడాయేవ్ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో యూరోపియన్ రెజ్లర్, సిల్వర్ మెడలిస్ట్ ఖమ్జాత్ అర్సామెర్జూయెవ్ను చిత్తు చేశాడు. సెమీఫైనల్లో ఆర్మేనియాకు చెందిన వాజ్జెన్ను 6-1 తేడాతో ఓడించాడు.

ఇదే టోర్నీలో పురుషుల 57 కిలోల విభాగంలో భారత్కు మరో పతకం దక్కింది. కాంస్య పోరులో భారత రెజ్లర్ రాహుల్ 4-0తో జర్మనీకి చెందిన నిక్లాస్ స్టెచెలేపై విజయం సాధించి బ్రాంజ్ దక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్-ఫైనల్లోరాహుల్ 5-3 తేడాతో కొరియాకు చెందిన కిమ్ సంగ్ను ఓడించాడు. కానీ సెమీఫైనల్లోరాహుల్ 6-7 తేడాతో అమెరికా రెజ్లర్ ల్యూక్ జోసెఫ్ చేతిలో ఓటమిపాలయ్యాడు.
ఇతర పోటీల్లో భారత్కు చెందిన ఉదిత్(61 కిలోల విభాగం), విక్కీ(97 కిలోల విభాగం) ఓటమిపాలయ్యారు. ఈ టోర్నీలో పొందే ర్యాకింగ్ పాయింట్స్.. ఈ ఏడాది సెప్టెంబర్లో క్రొయేషియాలోని జాగ్రెబ్ వేదికగా జరిగే వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో సీడింగ్ పొందేందుకు ఉపయోగపడుతాయి.