భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్పై మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ విమర్శలు గుప్పించాడు. ఆసియా కప్ 2025కు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అనుభవం కలిగిన శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సెలెక్షన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐపీఎల్ 2025 సీజన్తో పాటు యూఏఈ వేదికగానే జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన అయ్యర్ను ఎంపిక చేయకపోవడాన్ని నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. అయితే భారత టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు లేదని, అతను వేచి చూడాల్సిందేనని అగార్కర్ వివరణ ఇచ్చాడు. ఇందులో అయ్యర్తో పాటు తమ తప్పు లేదని, 15 మంది సభ్యులను మాత్రమే ఎంపిక చేయగలమని చెప్పాడు. అంతేకాకుండా అయ్యర్ కోసం ఎవరిని తప్పించాలని మీడియా ప్రతినిధులను ప్రశ్నించాడు.

అగార్కర్ ఇచ్చిన వివరణపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించిన బద్రీనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న రింకూ సింగ్, శివమ్ దూబే శ్రేయస్ అయ్యర్ కంటే మెరుగైన ఆటగాళ్లా? అని ప్రశ్నించాడు. 'ఆసియాకప్ 2025 టోర్నీకి శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాల్సింది. అతను దురదృష్టవంతుడని అగార్కర్ చెప్పడం తప్పించుకోవడానికి చెప్పే సాకు మాత్రమే. శ్రేయస్ అయ్యర్ గత రెండేళ్లుగా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్గా కూడా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. శ్రేయస్ అయ్యర్కు బదులుగా నెంబర్ 5 కోసం శివమ్ దూబే, రింకూ సింగ్లను ఎంపిక చేశారు.
గతేడాదిగా ఈ ఇద్దరూ పేలవ ప్రదర్శన కనబర్చారు. వారి గణంకాలను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. స్పిన్ను ఎదుర్కోవడంలో అద్భుతమైన సామర్థ్యం, ఫినిషింగ్ నైపుణ్యాలు కలిగిన శ్రేయస్ అయ్యర్ భారత జట్టులో నెంబర్ 5 స్థానానికి సరైన ఎంపిక. ఇది 50-50 నిర్ణయం కూడా కాదు. శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకోవాల్సింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేనందున జట్టుకు శ్రేయస్ అనుభవం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. ఇది దురదృష్టం కంటే వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా అనిపిస్తోంది.'అని అన్నారు.