World Cup 2023: సంచలన ప్రదర్శనతో ఆరోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు నిరాశే ఎదురైంది. ప్రపంచకప్తో స్వదేశం చేరిన ఆ జట్టుకు కనీస స్వాగతం లభించలేదు. అక్కడి అభిమానులు, ప్రభుత్వ అధికారులు ఆసీస్ విజయాన్ని లైట్ తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ మొత్తం బోసిపోయి కనిపించింది. దాంతో ఆసీస్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీని వరుస ఓటములతో ప్రారంభించిన ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆసీస్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరడమే కాకుండా.. ఆతిథ్య టీమిండియాను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. గత ఆదివారం జరిగిన ఈ మెగా ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రపంచకప్ అందుకున్నారు. వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్తో టీ20 సిరీస్ కోసం కొంతమంది క్రికెటర్లు ఇక్కడే ఉండిపోగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా మరి కొంతమంది సీనియర్ ఆటగాళ్లు స్వదేశం చేరుకున్నారు.
అయితే ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న జట్టుకు ఎక్కడైనా ఘనస్వాగతం లభిస్తుంది. కానీ ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు మాత్రం నిరాశే ఎదురైంది. కప్పుతో సిడ్నీ విమానాశ్రయంలో ల్యాండైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు ఎలాంటి స్వాగతం లభించలేదు. కేవలం మీడియా సిబ్బంది మాత్రమే ఫోటోలు తీసుకుంటూ కనిపించారు.
స్వాగతం పలికేందుకు అక్కడికి ఎవరూ రాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇండియన్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలిచిందనే విషయం అక్కడి ప్రజలకు తెలుసా? అని ఓ అభిమాని ప్రశ్నించగా..అసలు ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ మ్యాచ్లు ప్రసారం చేశారా ?అంటూ మరొకరు సెటైర్లు పేల్చారు.
ప్రపంచకప్ను ఆస్ట్రేలియన్లు సాధారణ టోర్నీలానే చూస్తారన్న ఓ నెటిజన్.. అందుకే వారు ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నారని కామెంట్ చేశాడు. అక్కడ క్రికెట్కే కాకుండా ఇతర క్రీడలను కూడా ఆదరిస్తారని అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ సార్లు గెలవడంతో లైట్ తీసుకుంటున్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.