లండన్: వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. చివరి రెండు మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి ఇంగ్లండ్ సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. టెస్ట్ల్లో 500వ వికెట్ల క్లబ్లో కూడా చేరాడు. కానీ ఈ గొప్ప ప్రదర్శనకు ముందు అతను తీవ్రంగా కుంగిపోయాడు. సౌతాంప్టన్లో జరిగిన ఫస్ట్ టెస్ట్కు ఎంపిక చేయకపోవడంతో బాధపడిన బ్రాడ్ ఓ దశలో కెరీర్కు గుడ్బై చెప్పాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
'ఫస్ట్ టెస్ట్ తుది జట్టులో స్థానం లభించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యా. బుర్రనిండా రిటైర్మెంట్ ఆలోచనలే. తాత్కాలిక కెప్టెన్ స్టోక్స్ వచ్చి.. నేను ఆడడం లేదని చెప్పినప్పుడు నోట మాట రాలేదు. శరీరమంతా వణికింది. అప్పటి వరకు తుది జట్టులో ఉంటాననే గట్టి నమ్మకంతో ఉన్నా. ఇదంతా ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. కానీ ఆ వారమంతా నాకు చాలా భారంగా గడిచింది. గతంలో కూడా నన్ను డ్రాప్ చేశారు. కానీ అప్పుడు సరైన కారణాలు ఉండటంతో నేనూ ఏమీ అనలేదు. మేమంతా బయో సెక్యూర్ బబుల్లో ఉండడంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టంగా కనిపించింది. అంతా గ్రౌండ్లోనే ఉన్న హోటల్లోనే ఉన్నాం. నిద్ర లేవగానే క్రికెట్ గ్రౌండే కనిపించేది. చుట్టూ క్రికెటర్లే ఉండేవారు. క్రికెట్టే లైఫ్ కాబట్టి దానికి దూరంగా ఉన్నందుకు చాలా బాధపడ్డా.'అని బ్రాడ్ తన బాధను చెప్పుకొచ్చాడు.
ఇక టెస్ట్ల్లో 600 వికెట్లు తీయడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్ తరఫున జేమ్స్ అండర్సన్ 589 వికెట్లతో టాప్లో ఉన్నాడు. ఇక తాను, అండర్సన్ జట్టులో కొనసాగడమే ఉత్తమమన్నాడు. 'జిమ్మీ, నేను జట్టులో కొనసాగడం మంచిదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. గత 18 నెలలుగా నేను టెస్ట్ క్రికెట్లో 20.5 యావరేజ్తో వికెట్లు తీస్తున్నా. వయసు ఒక సంఖ్య మాత్రమే. ఎవరైనా ఏ వయసులోనైనా ఏమైనా చేయవచ్చు.'అని బ్రాడ్ తెలిపాడు.