బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. 280 ప్లస్ రన్స్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించింది. ఈ ఓటమితో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆసీస్ పోరాటం ముగిసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన స్టీవ్ స్మిత్.. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. తక్కువ స్కోరే ఉన్నా.. మ్యాచ్ను ఆఖరి వరకు తీసుకొచ్చారని తెలిపాడు. 'బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. విజయం కోసం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా స్పిన్నర్లు మ్యాచ్ను చివరి వరకు తీసుకొచ్చారు. ఇది చాలా ట్రిక్కీ వికెట్. ఆరంభంలో బ్యాటింగ్ చేయడం, స్టైక్ రొటేట్ చేయడం చాలా కష్టమైంది. మా జట్టులోని ఆటగాళ్లంతా మెరుగైన ప్రదర్శన చేశారు. మ్యాచ్ ఆసాంతం అద్భుతంగా పోరాడారు.

పిచ్ చాలా భిన్నంగా ఉంది. స్పిన్నర్లకు కొంచెం పట్టు ఇచ్చింది. కొంత స్పిన్ అవ్వడంతో పాటు స్కిడ్ అయ్యింది. పేసర్లకు టూపేస్గా ఉంది. మేం మరిన్ని పరుగులు చేయాల్సింది. కీలక సమయంలో మేం వికెట్లు కోల్పోయాం. మేం 280 పస్ల రన్స్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. ప్రతీ దశలో వికెట్ చేజార్చుకున్నాం. ఈ మ్యాచ్లో ఓడినా.. ఈ టోర్నీలో జట్టుగా సమష్టి ప్రదర్శన చేశాం. బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణించింది. కొంతమంది బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ఇంగ్లండ్తో మేం అసాధారణ ప్రదర్శన కనబర్చాం. మా జట్టులోని కొంతమంది కుర్రాళ్లు భవిష్యత్తులో బిగ్ స్టార్లు అవుతారు.'అని స్మిత్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 73), అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/48) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/49), రవీంద్ర జడేజా(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 267 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(98 బంతుల్లో 5 ఫోర్లతో 84) సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లతో 45), కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 42), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు.