
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ఛాంపియన్గా గుజరాత్ టైటాన్స్ నిలిచే అవకాశం ఉందని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. వరుసగా రెండో టైటిల్ అందుకునే సత్తా ఆ జట్టుకు ఉందన్నాడు. గుజరాత్ టైటాన్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుతాయని జోస్యం చెప్పాడు. ఐపీఎల్ 2023 మినీవేలంలో అమ్ముడుపోని స్టీవ్ స్మిత్.. కామెంటేటర్గా కొత్త అవతారమెత్తనున్నాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తరఫున వ్యాఖ్యానం చేయనున్నాడు.
ఇప్పటికే భారత్కు వచ్చిన స్మిత్.. కామెంట్రీ చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో పాల్గొన్న స్మిత్.. తన అంచనాలను వెల్లడించాడు. 'నా అంచనా ప్రకారం ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచే అవకాశం గుజరాత్ టైటాన్స్కు ఉంది.
వరుసగా రెండో టైటిల్ గెలిచే సత్తా ఆ జట్టుకు ఉంది. నా అంచనా ప్రకారం పాయింట్స్ టేబుల్లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్లో నిలవనుండగా.. గుజరాత్ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. మూడో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్, నాలుగో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చోటు దక్కించుకుంటాయి.
ఐపీఎల్ 2023లో కామెంట్రీ చెప్పేందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నా వ్యాఖ్యానం చాలా సరదాగా ఉండటంతో పాటు నాకున్న పరిజ్ఞానంతో మ్యాచ్ జరుగుతున్న తీరును విశ్లేషించగలను. స్టార్ స్పోర్ట్స్ టీమ్లో భాగమవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నేను గేమ్ను బాగా రీడ్ చేయగలను. కామెంట్రీ కూడా జనాలకు నచ్చుతుందనే ఆశాభావంతో ఉన్నాను.
ఇక విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. చాలా ఏళ్లుగా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. లక్ష్యాలను అతను చేధించే తీరుకు నేను ఫీదా అవుతాను. చాలా ప్రశాంతంగా ఉంటూ పెద్ద లక్ష్యాలను సునాయసంగా చేధించడం కోహ్లీ ప్రత్యేకత. అతనో అమేజింగ్ ప్లేయర్. ఇక కెరీర్ అసాంతం ప్రశాంతంగా కనిపించిన ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ధోనీ భావోద్వేగాలను ప్రదర్శించడు. అతని నుంచి నేను నేర్చుకున్న విషయం ఇదే'అని స్మిత్ చెప్పుకొచ్చాడు. స్మిత్ తన ప్రిడిక్షన్స్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ పేరు చెప్పకపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.