సిగ్గు చేటు..
తనపై ఇలాంటి నిందలు రావడం ఎంతో బాధగా ఉందని అన్నాడు. 'నాపై నిందలు రావడం ఆశ్చర్యంగా, బాధగా ఉంది. మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు, వాటిని ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటున్నారని ఊహిస్తూ... క్రీజులో గార్డు మార్క్ను చేసుకుని ఆలోచించడం నాకు అలవాటు. కానీ టీమిండియా ఆఖరి రోజు చేసిన అద్భుత పోరాటాన్ని మరిచి ఈ విషయాన్ని ఎత్తిచూపించడం మాత్రం సిగ్గుచేటుగా అనిపిస్తోంది'' అని స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు.
పైన్ మద్దతు..
ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ కూడా స్మిత్కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్లో స్మిత్ క్రీజు వద్దకు వెళ్లి అతడే బ్యాటింగ్ చేస్తున్నట్లు గార్డ్ మార్క్ను మార్చుకుంటాడని తెలిపాడు. అతనిది దురుద్దేశమైతే టీమిండియా ఫిర్యాదు చేసేది కదా అని ప్రశ్నించాడు. 'ఈ అంశంపై నేను స్మిత్తో మాట్లాడాను. అది సామాజిక మాధ్యమాల్లో కనిపించిన విధానంపై అతను నిరాశ చెందాడు. మీరు స్టీవ్ స్మిత్ను టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు చూస్తే.. ఇలా క్రీజు వద్దకు వెళ్లి తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు రోజుకు ఐదు లేదా ఆరుసార్లు ఊహించుకుంటాడు. గార్డును తనకు అనుకూలంగా మార్చుకుంటాడు'అని తెలిపాడు.
ఇంతకేం జరిగిందంటే..?
చివరి రోజు ఆటలో రెండో సెషన్లో ఆటగాళ్లు డ్రింక్స్ బ్రేక్కు వెళ్లారు. అయితే ఆ సమయంలో స్మిత్ క్రీజు వద్దకు వచ్చాడు. పంత్ చేసుకున్న మార్క్ను తన షూతో చెరిపివేశాడు. ఇదంతా స్టంప్స్ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే దీనిపై మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో భారత కెప్టెన్ అజింక్యా రహానేను ప్రశ్నించగా.. ఆ వీడియోని తాను చూడలేదని సున్నితంగా తిరస్కరించాడు. మరోవైపు ఈ వీడియోను దిగ్గజ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేశాడు. స్మిత్ ఎంతో ప్రయత్నించినా, ప్రయోజనం దక్కలేదని తనదైన శైలిలో సైటైర్లు సంధించాడు.
|
స్మిత్ తప్పులేదు..
అయితే ఈ ఘటనలో స్టీవ్ స్మిత్ది ఏ మాత్రం తప్పులేదు. అతన్ని అందరూ అపార్థం చేసుకున్నారు. అతను చెప్పినట్లు షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ఈ ఆసీస్ బ్యాట్స్మెన్కు అలవాటే. పంత్ గార్డ్ స్మిత్ చెరిపేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన పూర్తి వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో స్మిత్ కన్నా ముందే మైదాన సిబ్బంది పిచ్ను క్లీన్ చేశారు. ఆ తర్వాతే స్మిత్ షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గార్డ్ గీసుకున్నాడు. అంతే తప్పా పంత్ గార్డ్ చెరిపేయాలని కాదు. ఇక, ఈ మూడో టెస్టులో టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా జనవరి 15న ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.