
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్లోని భారత వైఫల్యం అటు ఐసీసీ, ఇటు అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్కు భారీ నష్టాలు తెచ్చిపెట్టనుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్తో చిత్తుగా ఓడిన టీమిండియా.. సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్లు గెలిచినా భారత్ ముందంజ వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే భారత్ లేని నాకౌట్ మ్యాచ్లు కళ తప్పనున్నాయి. 2007 వన్డే ప్రపంచకప్ మాదిరి సాదా సీదాగా టోర్నీ ముగియనుంది. ముఖ్యంగా క్రికెట్ను మతంలా భావించే భారత అభిమానులను మెగా టోర్నీ మిస్సవ్వనుంది. ఇప్పటికే భారత వైఫల్యంతో సగానికి పైనా అభిమానులు ఈ టోర్నీ గురించి ఆలోచించడమే మానేసారు. దాంతో ఐసీసీతో పాటు బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్కు తీవ్ర నష్టాలు తప్పేలా లేవు. అయితే ఈ పరిస్థితికి ఐసీసీ, బీసీసీఐ, స్టార్ స్పోర్ట్స్ అత్యాశేనే కారణమని విశ్లేషకులు అంటున్నారు.
దుబాయ్లో రాత్రి పూట మంచు ఆటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నైట్ మ్యాచ్ల్లో టాస్ నెగ్గిన జట్లు, ఛేజింగ్ చేసిన టీమ్స్కు అది అనుకూలంగా మారింది. గత రెండు మ్యాచ్ల్లోనూ కోహ్లీ టాస్ ఓడిపోయి, ఫస్ట్ బ్యాటింగ్ చేయడం దెబ్బకొట్టింది. అయితే, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లకు కనీసం ఒక్క మ్యాచ్ అయినా మధ్యాహ్నం(3.30) షెడ్యూల్ చేశారు. ఆ టైమ్లో మంచు ప్రభావం ఉండదు. కానీ, బ్రాడ్కాస్టర్ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఐసీసీ, బీసీసీఐ,.. ఇండియా ఆడే అన్ని మ్యాచ్లను రాత్రిపూటే షెడ్యూల్ చేశాయి. పైగా, పాక్, కివీస్తో పెద్ద మ్యాచ్లు ఆదివారాల్లో జరిగేలా వారం గ్యాప్ ఇచ్చాయి.
అలాగే, ఒక్కటి మినహా భారత్ ఆడే అన్ని మ్యాచ్లను పెద్ద స్టేడియం ఉన్న దుబాయ్లోనే షెడ్యూల్ చేశాయి. తద్వారా టికెట్ల అమ్మకం ద్వారా ఎక్కువ డబ్బు వస్తాయని భావించాయి. ఈ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. అసలుకే మోసం వచ్చింది. ఈ నెల 8న న్యూజిలాండ్ను అఫ్గాన్ ఓడించకపోతే ఇండియా సెమీస్కు వెళ్లే చాన్స్ లేదు. మెగా టోర్నీలో భారత్ లేని నాకౌట్ దశ అంతగా మజా రాకపోవచ్చు. టీమిండియా ఆడే తదుపరి నామమాత్రపు మ్యాచ్లకు ప్రేక్షకుల స్పందన కూడా అంతంత మాత్రమే ఉండనుంది. ఇప్పటికే భారత వైఫల్యాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
టీమిండియా ఓడటం కన్నా ఓడిన తీరే అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. ఇది ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ వ్యూయర్షిప్పై ప్రభావం చూపనుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు 5 సెకన్ల యాడ్కు రూ.25 నుంచి రూ.30 లక్షలు తీసుకున్న స్టార్ స్పోర్ట్స్.. టోర్నీలో భారత్ ఆడే అన్నీ మ్యాచ్లకు భారీగానే ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు ఇవన్నిటిపై ప్రభావం చూపనుంది. భారీ ధరకు బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్కు ఈ మెగాటోర్నీతో ఆ డబ్బులు రాబట్టాలనుకుంది. కానీ భారత వైఫల్యం వారి కొంపముంచుతుంది.