
న్యూఢిల్లీ: నాలుగేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 టోర్నీ సమయం ఆసన్నమైంది. యూఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్లు ఇదివరకే అర్హత సాధించగా.. ఆరో బెర్త్ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్లో తలపడనున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాల్సి ఉండగా అక్కడ నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎడారి దేశం అయిన యూఏఈకి తరలించారు.
టీ20 ప్రపంచకప్కు ముందు మినీ వరల్డ్కప్గా సాగనున్న ఈ టోర్నీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను రెండింతలు చేస్తూ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్పోర్ట్స్ తాజాగా ప్రోమోను విడుదల చేసింది. ట్విటర్ వేదికగా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్న స్టార్ స్పోర్ట్స్.. ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం అంటూ క్యాప్షన్ను జోడించింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 45 సెకెన్ల పాటు సాగిన ఈ ప్రోమోను ఇండియా విజయాన్ని కాంక్షిస్తూ ఓ పాటతో రూపొందించారు.
ఇందులో 'మా భారత్ నెంబర్ వన్. ఇప్పుడు మేం ఆసియా (ఆసియా కప్) ను గెలుస్తాం. మా పొరుగుదేశాలు కూడా ఈ టోర్నీని గెలవడానికి ఆరాటపడుతున్నాయి. కానీ సగర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా మేమిక్కడికి వచ్చింది గెలవడానికే అని మా ప్రత్యర్థులకు చెబుతున్నాం.'అనే అర్థంలో ప్రోమో సాంగ్ ఉంది. ఈ వీడియోలో అత్యధిక భాగం భారత ఆటగాళ్లు దర్శనమివ్వగా.. పాక్ నుంచి బాబర్ ఆజమ్, షాహిన్ అఫ్రిది, బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్, అఫ్గానిస్తాన్ తరఫున రషీద్ ఖాన్ కనిపించారు.
ఈ టోర్నీలో ఆగస్టు 28న భారత్-పాకిస్థాన్ జట్లు గ్రూప్ దశలో తలపడనున్న విషయం తెలిసిందే. 2016తో పాటు 2018లో కూడా భారత జట్టే ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇక ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు కూడా టీమిండియానే కావడం గమనార్హం. 1984 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా.. ఇప్పటివరకు భారత జట్టు ఏడుసార్లు ట్రోఫీ నెగ్గింది. శ్రీలంక ఐదుసార్లు గెలుపొందగా పాకిస్తాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. మరి ఈసారి విజేత ఎవరవుతారని ఆసియా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.