ఐపీఎల్ 2026 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్కు గుడ్ న్యూస్. మాజీ బీసీసీఐ, ఐసీసీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ తిరిగిన సీఎస్కే ఛైర్మెన్గా నియమితులయ్యారు. ఐపీఎల్ 2025 సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన సీఎస్కే.. శ్రీనివాసన్ నియామకం బూస్ట్ ఇవ్వనుంది. క్రికెట్ పరిపాలన అధ్యక్షుడిగా శ్రీనివాసన్కు అపారమైన అనుభవం ఉంది. అతని అనుభవం జట్టు తిరిగి పుంజుకునేలా చేయనుంది. గతేడాది డిసెంబర్లో సీఎస్కే వ్యవస్తాపక కంపెనీ అయిన ఇండియా సిమెంట్స్ తమ వ్యాపారాన్ని అల్ట్రాటెక్కు విక్రయించింది. దాంతో శ్రీనివాసన్తో పాటు అతని కుటుంబ సభ్యులు జట్టు డైరెక్టర్ల బోర్డు నుంచి తాత్కలికంగా వైదొలిగారు. ఈ ఏడాది ఫిబవ్రరిలో శ్రీనివాసన్తో పాటు ఆయన కుమార్తె రూపా గురునాథ్ తిరిగి డైరెక్టర్లుగా నియామకమయ్యారు.
తాజాగా 80 ఏళ్ల శ్రీనివాసన్ తిరిగిన సీఎస్కే ఛైర్మన్గా నియమితుడయ్యాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. సీఎస్కే జట్టు ఏర్పాటులో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా సీఎస్కే నిలవడం వెనుక శ్రీనివాసన్ ఉన్నారు. ఇండియా సిమెంట్స్ ఛైర్మెన్గా ఉన్నప్పుడు.. జట్టును ప్రత్యక్షంగా నిర్వహించకపోయినా.. పరోక్షంగా మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2011లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తల్లో ఒకరిగా నిలిచాడు. కానీ 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం కారణంగా ఆయన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా సీఎస్కే రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొంది.

శ్రీనివాసన్ ఛైర్మెన్గా బాధ్యతలు చేపట్టారని సీఎస్కే విశ్వనాథన్ మీడియాకు తెలిపారు. 'శ్రీనివాసన్ తిరిగి జట్టులోకి రావడం సీఎస్కేకు గొప్ప వరం లాంటిది. ఆయన అత్యుత్తమమైన నిర్వాహకుడు. శ్రీనివాసన్ పునరాగమనం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన జట్టుతో ప్రయాణించకున్నా.. సలహాదారు పాత్రలో సేవలు అందిస్తారు. మేము ఆయనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతాం. ప్రస్తుతం మేం ఇద్దరం చెన్నైలోనే ఉన్నాం. కాబట్టి రోజువారి వ్యవహారాల్లో ఆయన మాతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటారు.'అని విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.
సీఎస్కేసీఎల్ బోర్డు ఛైర్మన్గా ఐపీఎల్ 2026తో పాటు సౌతాఫ్రికా 20 లీగ్ వరకు ఫ్రాంచైజీకి చెందిన జట్లను పర్యవేక్షించనున్నారు. ఆయన టీమ్ డైరెక్టర్ గురునాథ్, సీఈఓ విశ్వనాథన్తో కలిసి పని చేస్తారు. ఈ బోర్డులో అనుభవజ్ఞులైన సభ్యులు సంజయ్ పటేల్, ఆర్ శ్రీనివాసన్, రాకేష్ సింగ్, పీఎల్ సుబ్రమణియన్, మణికం, జయశ్రీ ఉన్నారు. శ్రీనివాసన్ రీఎంట్రీతో ధోనీ కొనసాగుతాడనే విషయం స్పష్టమవుతోంది.