
న్యూఢిల్లీ: యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న భారత్ X పాకిస్థాన్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని నిమిషాల్లో ఈ మెగాపోరుకు తెరలేవనుంది. చాలాకాలంగా ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగకపోవడంతో ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా ఇరు దేశాలు గతేడాది టీ20 ప్రపంచకప్లో తలపడగా.. అక్కడ భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. దాయాది చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్లో పాక్పై ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
దాంతో ఇప్పటికే ఈ మ్యాచ్పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దానికితోడు మ్యాచ్ ఆదివారం జరుగుతుండటంతో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మ్యాచ్ను ఎంజాయ్ చేసేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. దాయాదుల పోరు ముంగిట శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) విద్యార్థులకు డీన్ ఊహించని షాకిచ్చాడు.
ఈరోజు జరిగే భారత్, పాక్ మ్యాచ్ని ఎన్ఐటీలో ఎవరూ చూడకూడదని ఆదేశాలు జారీ చేశాడు. హాస్టల్లో గుంపులు చేరి మ్యాచ్ చూడకూడదని ఆదేశాలు జారీ చేసిన డీన్.. సోషల్ మీడియాలో కూడా ఎన్ఐటీ విద్యార్థులు ఎవరూ ఆ మ్యాచ్పై కామెంట్లు పెట్టకూడదని అందులో పేర్కొన్నాడు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు రూల్స్ బ్రేక్ చేస్తే వారిని హాస్టల్ నుంచి గెంటేయడమే కాకుండా.. రూ.5వేలు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించాడు.
2016లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా కాలేజీలో విద్యార్థులు రెండు గ్రూప్లుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే అలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు మ్యాచ్ను ఎవరూ వీక్షించకుండా ఆంక్షలు విధించారు.