ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. శుభ్మన్ గిల్ను జట్టు నుంచి తప్పిస్తారని తాను అస్సలు ఊహించలేదని, ఇది సాహోసోపేత నిర్ణయమని కొనియాడాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడని ప్రశంసించాడు. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే భారత జట్టును గత శనివారం(డిసెంబర్ 20) బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు జితేష్ శర్మకు చోటు దక్కలేదు. వారి స్థానంలో ఇషాన్ కిషన్, రింకూ సింగ్ రీఎంట్రీ ఇచ్చారు.
టీమ్ కాంబినేషన్లో భాగంగానే శుభ్మన్ గిల్ను పక్కనపెట్టామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వివరణ ఇచ్చారు. ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బలాన్ని పెంచేందుకు రింకూ సింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ జట్టుపై తాజాగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'శుభ్మన్ గిల్ను తప్పించడం చూసి షాక్ అయ్యాను. ఇది చాలా మంచి నిర్ణయం. భారత జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ను తప్పిస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఆడాడు. తాజాగా జట్టులోకి రింకూ సింగ్, ఇషాన్ కిషన్ వచ్చారు. ఇషాన్ కిషన్ చాలా రోజులుగా భారత జట్టులో లేడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనికి అవకాశం ఇచ్చారు. నిజంగా ఇది మంచి నిర్ణయం. ఈ విషయంలో నేను అజిత్ అగార్కర్తో పాటు మిగిలిన సెలెక్టర్లను అభినందిస్తున్నా. శుభ్మన్ గిల్ వన్డే, టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన ఆటగాడు.
ఇంగ్లండ్ పర్యటనలో పరుగుల మోత మోగించాడు. అయితే టీ20 ఫార్మాట్లో మాత్రం అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని స్ట్రైక్రేట్, పరుగులు చేసే సామర్థ్యం ఇతర ఓపెనర్లలా లేవు. అందుకే సెలెక్టర్లు అభిషేక్ శర్మ-సంజూ శాంసన్లను ఓపెనర్లుగా కొనసాగించారు.
ప్రస్తుతం అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఉన్నాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ వికెట్ కీపర్గా జట్టులో చోటు దక్కించుకున్నారు. దేశవాళీ క్రికెట్లో ఇషాన్ కిషన్ పరుగుల మోత మోగించి భారత జట్టు పిలుపును అందుకున్నాడు. ఇషాన్ కిషన్ ఎంపిక చాలా సంతోషాన్నిచ్చింది. వన్డే క్రికెట్లో అతనికి డబుల్ సెంచరీ ఉంది. వన్డే ప్రపంచకప్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. అతను ఆకస్మాత్తుగా భారత జట్టుకు దూరమయ్యాడు.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది గిల్ 15 టీ20 ఇన్నింగ్స్ల్లో 137.26 స్ట్రైక్రేట్తో 291 పరుగులే చేశాడు.