టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి నిప్పులు చెరిగాడు. మ్యాచ్ విన్నర్ను పక్కనపెడితే ఫలితం ఇలానే ఉంటుందని విమర్శించాడు. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వైఫల్యంతో పాటు వర్షం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో టీమిండియా రిస్ట్ కుల్దీప్ యాదవ్ లేకుండా బరిలోకి దిగింది. దాంతో కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
తాజాగా ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. హెడ్ కోచ్ గంభీర్ను గట్టిగా అర్సుకున్నాడు. ఈ పర్యటనకు ముందు హర్షిత్ రాణాను ఎంపిక చేయడాన్ని క్రిష్ శ్రీకాంత్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. గంభీర్ ప్రియ శిష్యుడు కావడంతోనే హర్షిత్ రాణాకు మూడు ఫార్మాట్లలో అవకాశం దక్కుతుందని విమర్శించాడు.

ఈ విమర్శలపై గంభీర్ ఘాటుగా స్పందించాడు. యూట్యూబ్ వ్యూస్ కోసం ఓ యువ ఆటగాడిపై విమర్శలు గుప్పించడం సరికాదని మందలించాడు. గంభీర్ కౌంటర్పై మౌనం వహించిన క్రిష్ శ్రీకాంత్.. తొలి వన్డే పరాజయం నేపథ్యంలో తన విమర్శలను ఎక్కుపెట్టాడు. కుల్దీప్ యాదవ్ ఆడించకుండా టీమిండియా తప్పు చేసిందని మండిపడ్డాడు. టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ కీలక వికెట్లు తీసాడని గుర్తు చేశాడు.
'మిచెల్ స్టార్క్, హజెల్ వుడ్ కాకుండా ఆసీస్కు అవసరమైన బ్రేక్ త్రూలు అందించింది ఎవరు? స్పిన్నర్ అయిన మాథ్యూ కుహ్నెమన్. అక్షర్ కూడా మనకు కీలకమైన వికెట్ అందించాడు. స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. వారు ఎప్పుడూ మెరుగ్గా రాణిస్తారు. రిస్ట్ స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచే సామర్థ్యం ఉంటుంది. కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టడం వెనుక ఉన్న లాజిక్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను అయితే కుల్దీప్, వాషింగ్టన్, అక్షర్ పటేల్ ముగ్గుర్ని ఆడించాలని చెబుతాను.
కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. టెస్ట్ల్లో రాణించాడు. ఆసియా కప్లో అదరగొట్టాడు. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియన్ వికెట్లపై బంతి టర్న్ కాదని, అందుకే కుల్దీప్ యాదవ్ ఆడించలేదని చెప్పవచ్చు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన స్టేట్మెంట్. ఇది నాకు అస్సలు అర్థం కాదు. అసలు 8 మంది బ్యాటర్ల కాంబినేషన్ను మర్చిపోండి. అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగండి. 8 మంది బ్యాటర్లు ఎన్ని పరుగులు చేస్తారు?'అని క్రిష్ శ్రీకాంత్ విమర్శించాడు.