పోటీ పతాకస్థాయిలో ఉంది..పరుగులు చేస్తేనే టీ20 ప్రపంచకప్ ఛాన్స్!లేదంటే కోహ్లీ వస్తాడు! లక్ష్మణ్ హెచ్చరిక!

హైదరాబాద్: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ను భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ధావన్ చోటు దక్కించుకోవాలంటే.. నిలకడగా భారీ పరుగులు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే జట్టులో ప్రతి స్థానానికీ విపరీతమైన పోటీ నెలకొందని, ఓపెనింగ్ స్థానం కోసం విరాట్ కోహ్లీ పోటీలో ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసులో ధావన్ తప్పకుండా రాణించాలని లక్ష్మణ్ అన్నారు. లంక పర్యటనకు గబ్బర్ కెప్టెన్గా ఎంపికయిన విషయం తెలిసిందే.

అందరికన్నా ఎక్కువ పరుగులు చేయాలి
తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ... 'శిఖర్ ధావన్ లంక పర్యటనను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకోవాలి. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇప్పటికే ఓపెనర్లుగా స్థిరపడిపోయారు. అవసరమైతే టీ20ల్లో తానే ఓపెనింగ్ చేస్తానని విరాట్ కోహ్లీ సైతం ప్రకటించాడు. అందుకే ధావన్ అందరికన్నా ఎక్కువ పరుగులు చేయాలి. టీమిండియాకు కెప్టెన్గా ఎంపికవ్వడం గబ్బర్ను ఉత్సాహపరిచేదే. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఎవరైనా గర్వపడతారు. అయితే అతడు పరుగులు చేయడం, జట్టులో చోటు సుస్థిరం చేసుకోవడంపై దృష్టి సారించాలి' అని అన్నారు.

గాయాలు, ఫామ్ కారణంగా
ప్రస్తుతం టీ20ల్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా స్థిరంగా రాణిస్తున్నారు. 2020కి ముందు శిఖర్ ధావన్ రెగ్యులర్గా ఓపెనింగ్ చేశాడు. గాయాలతో ఎప్పుడైతే అతడు దూరమయ్యాడో రాహుల్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మొత్తంగా 49 ఇన్నింగ్సుల్లోనే 39.92 సగటుతో 1557 పరుగులు చేశాడు. ఇక ధావన్ 65 మ్యాచుల్లో 27.88 సగటుతో 1673 పరుగులు చేశాడు. నిజానికి గబ్బర్ గత రెండు సంవత్సరాలుగా జట్టులోకి వస్తూపోతున్నాడు. గాయాలు, ఫామ్ కారణంగా తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇప్పటికే టెస్టుల్లో స్తానం కోల్పోయిన గబ్బర్.. పరిమిత ఓవర్లలో కూడా రాణించకుంటే అంతే సంగతులు.

అక్టోబర్ 17న ఆరంభం
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్ 2021.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్ దేశాలకు తరలివెళ్లింది. అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ప్రపంచకప్ను నిర్వహించనున్నారు. మెగా టోర్నీ నిర్వహణ వేదిక, తేదీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవలే ప్రకటించింది. మెగా టోర్నీ మ్యాచ్లు మొత్తం నాలుగు వేదికల్లో జరగనున్నాయి.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో మెగా టోర్నీ మ్యాచ్లను నిర్వహించనున్నారు. టోర్నమెంట్ తొలి రౌండ్లో అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడుతాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్లు.. సూపర్12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్తో కలుస్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2022 కొత్త ఫ్రాంచైజీల బ్లూప్రింట్ ఇదే.. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.2000 కోట్లు! నలుగురికే ఛాన్స్!