
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు కొత్త జట్ల విస్తరణ వ్యవహారాలను త్వరలోనే ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమవుతోంది. ఇందుకోసం కోసం బీసీసీఐ ఓ బ్లూప్రింట్ను సిద్ధం చేసింది. ఆగస్టు 2021 నుంచి జనవరి 2022 లోగా రెండు కొత్త జట్లకు సంభదించిన పూర్తి ప్రక్రియ పూర్తికానుంది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, ఐపీఎల్ 2022 మెగా వేలం, జట్ల సాలరీ పర్స్ ఇంక్రిమెంట్ మరియు మీడియా హక్కులకు సంబంధించి అన్నింటిని ఈ కాలపరిమితిలో బీసీసీఐ పూర్తిచేయనుంది.
మొత్తానికి ఐపీఎల్ లీగ్లో రెండు కొత్త ఫ్రాంచైజీలను ప్రవేశపెట్టాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్ను 10 జట్లకు పెంచాలని ఎప్పట్నుంచో భావిస్తోంది. ఐపీఎల్ 2021 నుంచే 10 జట్లను ఆడించాలని బీసీసీఐ చూసినా.. సమయం లేకపోవడంతో అది కుదరలేదు. ఇక కొత్త ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు, స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ కనీస విలువ రూ.2000 కోట్లుగా ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది.
రెండు కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి ఐపీఎల్ 2022 టెండర్ పత్రం ఆగస్టు మధ్యలో విడుదల కానుంది. అక్టోబర్ మధ్యలో బిడ్ల (ప్రాంచైజీలను) ఆహ్వానం, డిసెంబర్ మాసంలో మెగా యాక్షన్ జరగనుంది. ఇక జనవరి 2022లో మీడియా హక్కులు బీసీసీఐ ఇవ్వనుంది. ఐపీఎల్ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయేందుకు ఆస్కారం ఉంది. అలాంటప్పుడు ఫ్రాంచైజీల విలువ గరిష్ఠంగా 50% పెరుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు 4 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉందని సమాచారం. ఇందులో ముగ్గురు భారతీయులు మరియు 1 విదేశీ ప్లేయర్.. లేదా ఇద్దరు భారతీయులు మరియు ఇద్దరు విదేశీలు ఉండే అవకాశం ఉంది. ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు.. ఒక్కరినే తీసుకుంటే రూ.12.5 కోట్లు ఇవ్వాలి.
ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు బీసీసీఐ పెంచింది. అంటే 10 ఫ్రాంచైజీల నుంచి రూ.50 కోట్లు జమ అవుతుంది. ఫ్రాంచైజీలు ఇందులో కనీసం 75% ఖర్చు చేయాలి. ఏటా రూ. 5 కోట్లు పెంచుతూ.. 2024కు ఈ జీతాల నిధిని రూ.100 కోట్లకు చేరుస్తారని తెలిసింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తమ ఫ్రాంచైజీలో కొంత వాటాను ఓ సంస్థకు విక్రయించింది. దాని విలువను రూ.1855 కోట్లు. అలాంటప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ విలువ కనీసం రూ.2200-2500 కోట్లుగా ఉండొచ్చట. ముంబై ఇండియన్స్ విలువ రూ.2700-2800 కోట్లు ఉంటుందని అంచనా. కోల్కతా, బెంగళూరు విలువ సైతం ఎక్కువగానే ఉండొచ్చు.