
కొలంబో: మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్లు ఉంది శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) పరిస్థితి. ఇప్పటికే ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో క్రికెట్ దేశాలను బతిమాలి ద్వైపాక్షి సిరీస్లు నిర్వహిస్తున్న లంక బోర్డుకు ఊహించని షాక్ తగిలింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళనలకు దిగారు. ఈ నిరసన కార్యక్రమాలు హద్దులు దాటడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. రాజపక్స వెళ్లిపోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన చేశారు.
ఆస్ట్రేలియాతో 3 టీ20లు, ఐదు వన్డేలు, 2 టెస్ట్ సిరీస్లను దిగ్విజయంగా పూర్తి చేసి ఉత్సాహంగా ఉన్న లంక బోర్డుకు తాజా పరిణామం కోలుకోలేని దెబ్బకొట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో త్వరలో జరగనున్న శ్రీలంక - పాకిస్థాన్ సిరీస్ తో పాటు ఆసియా కప్ నిర్వహణపై సందిగ్దత నెలకొంది. ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆసియా కప్ వేదికను మార్చే ప్రయత్నాలు చేస్తున్నది. లంక నుంచి బంగ్లాదేశ్కు ఆసియాకప్ 2022ను తరలించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే బంగ్లా బోర్డుతో ఆదిశగా చర్చలు కూడా జరిపింది. ఆగస్టు 27 నుంచి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.
మరోవైపు లంకతో రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్థాన్ జట్టు ఇప్పటికే లంకకు వచ్చింది. ఈనెల 16న పాకిస్థాన్-శ్రీలంక మధ్య గాలే వేదికగా తొలి టెస్టు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఇరు జట్ల ఆటగాళ్లు గాలేలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఇదిలాఉండగా ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమల్లోకి వస్తాయి. మరి క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించడమనేది సాధ్యమయ్యే పనే కాదు. దీంతో లంక బోర్డు పాకిస్థాన్తో సిరీస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పుడుప్పుడే లంకలో ఈ సంక్షోభం ముగిసిపోయే అవకాశం కూడాలేకపోవడంతో మళ్లీ అక్కడ మ్యాచుల నిర్వహణ కూడా కష్టమే. దాంతో సిరీస్ ను ఉపసంహరించుకోవడం మినహా లంక బోర్డుకు మరో దారి లేదు.