టీమిండియా బ్యాటర్లపై శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లు తమ బ్యాట్లను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆరోపించాడు. భారత బ్యాటర్లు ఉపయోగించే బ్యాట్లు చాలా ప్రత్యేకమైనవని, వాటిని మరెవరూ కొనుగోలు చేయలేరని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 20 పరుగులతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజపక్స.. భారత బ్యాటర్లు ఉపయోగిస్తున్న బ్యాట్లు అసాధారణ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపాడు. ఈ ప్రత్యేకమైన బ్యాట్లతో భారత ఆటగాళ్లు భారీ షాట్స్ ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోని ఏ ఇతర క్రికెటర్ కూడా ఈ బ్యాట్లను కొనుగోలు చేయలేడని తెలిపాడు.

'మనకు దొరికే అత్యుత్తమ బ్యాట్ల కంటే భారత ఆటగాళ్ల వద్ద ఉన్న బ్యాట్లు చాలా మెరుగైనవి. ఆ బ్యాట్లపై ఒక రబ్బరు పొర వేసినట్లు ఉంటుంది. అది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఈ బ్యాట్లను ఇతరులు కొనుగోలు చేయలేరు. ఈ విషయం ఆటగాళ్లందరికీ తెలుసు'అని రాజపక్స చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ టోర్నీల సందర్భంగా భారత ఆటగాళ్ల కిట్స్పై సందేహాలు వ్యక్తమవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా మంది మాజీ క్రికెటర్లు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. 2023 ప్రపంచకప్ సమయంలోనూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా కూడా ఇలాంటి సందేహాలే వ్యక్తం చేశాడు. భారత బౌలర్లకు ఐసీసీ, బీసీసీఐ ప్రత్యేకమైన బంతులను ఇస్తున్నాయని, అందుకే బ్యాటింగ్కు అనుకూలించే పిచ్లపై కూడా భారత్కు అదనపు స్వింగ్ లభిస్తోందని ఆయన ఆరోపించారు.
భారత మ్యాచ్ల్లో వాడే బంతులను ఐసీసీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని హసన్ రజా డిమాండ్ చేశాడు. అయితే, ఆయన వ్యాఖ్యలపై వసీం అక్రమ్తో పాటు పలువురు మాజీ భారత క్రికెటర్లు తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా, భారత్ డిఆర్ఎస్ను కూడా తారుమారు చేస్తోందని రజా ఆరోపించాడు. కానీ, ఆ వ్యాఖ్యలను కామెంటేటర్ ఆకాష్ చోప్రా 'కామెడీ'గా అభివర్ణించాడు.
తాజాగా భానుకా రాజపక్స భారత బ్యాటర్లపై చేసిన వ్యాఖ్యలను క్రికెట్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఒక బ్యాటర్ బంతిని బలంగా బాదుతున్నాడంటే అతని బలమే కారణమని.. కేవలం బ్యాట్ వల్ల కాదని కొట్టిపారేస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్ దూకుడైన అప్రోచ్ను మొదలుపెట్టిందని గుర్తు చేస్తున్నారు. భారత ఆటగాళ్ల ఫియర్లెస్ గేమ్ను కొనియాడలేక అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు.