
కొలంబో: శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 30 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. లంక బోర్డు సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది.
గతేడాది జూలైలో వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రాజపక్స.. ఈ 30 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కేవలం ఆర్నెళ్లు మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా తన కెరీర్లో 5 వన్డేలు, 18 టీ20లు ఆడి 409 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2021 బరిలోకి దిగిన లంక జట్టులోనూ రాజపక్స ఉన్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మూడో లంక బ్యాటర్గా నిలిచాడు. మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడి 155 పరుగులు చేశాడు.
లంక బోర్డు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిట్నెస్ మార్గదర్శకాల కారణంగానే రాజపక్స రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతీ ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టనున్నారు.
30 ఏళ్ల రాజపక్స..రిటైర్మెంట్ ప్రకటించడం శ్రీలంక క్రికెట్లో సంచలనంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి అతను అనూహ్యంగా తప్పుకోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు స్పందించారు. రాజపక్స.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. లసిత్ మలింగాతో పాటు ఇతర మాజీ క్రికెటర్లు రాజపక్సను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇక శ్రీలంక అండర్-19 జట్టులో రాజపక్ష అద్భుతంగా రాణించి.. సీనియర్ జట్టులోకి వచ్చాడు. గతేడాది స్వదేశంలో శిఖర్ ధావన్ సేనతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా వన్డే అరంగ్రేటం చేసిన అతను.. వన్డేల్లో ఒకటి, టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.