
కొలంబో: ఆసియా కప్ 2022 టోర్నీని నిర్వహించడం తమ వల్ల కాదని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమ దేశంలో ఒక్క పూట తిండికే అల్లాడుతున్నామని, ఈ పరిస్థితిల్లో టోర్నీ నిర్వహణ తమ వల్ల కాదని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలంక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
ఇక షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే నిన్నామొన్నటి వరకు తమదేశంలోనే ఆసియా కప్ను నిర్వహించాలని ఏసీసీని కోరిన ఎస్ఎల్సీ తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్ల సిరీస్ లను విజయవంతంగా నిర్వహించినా.. ప్రస్తుతం పాకిస్థాన్ తో టెస్టు సిరీస్ను కూడా ఏ ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్న లంక క్రికెట్ బోర్డు.. ఆసియా కప్ నిర్వహణ మాత్రం తమ వల్ల కాదంటూ తేల్చేసింది. ఆరు దేశాలు పాల్గొనబోయే ఈ టోర్నీలో ఆటగాళ్లకు హోటల్ వసతులు, స్టేడియంలో సౌకర్యాల కల్పన, ఇతరత్రా ఖర్చు తడిసిమోపడవుతుంది.
ఈ నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహించి అపకీర్తి మూటగట్టుకోవడం కంటే తప్పుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి లంక బోర్డు వచ్చినట్టు సమాచారం.
శ్రీలంక కాకుంటే బంగ్లాదేశ్ లో అయినా ఈ సిరీస్ నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు ప్రయత్నాలు చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. గతంలో ఏసీసీ అధికారులు కూడా 'శ్రీలంకలో సాధ్యం కాకుంటే మేము బంగ్లాదేశ్ ను స్టాండ్ బై గా పెట్టుకున్నాం..' అని తెలిపిన విషయం విదితమే. కానీ ఇప్పుడు బంగ్లా కూడా రేసు నుంచి తప్పుకుంది. ఈ టోర్నీని నిర్వహించేందుకు యూఏఈ క్రికెట్ బోర్డును సంప్రదించినట్టు తెలుస్తున్నది. బీసీసీఐ, ఎస్ఎల్సీ తో పాటు ఏసీసీ ప్రతినిధులు కూడా యూఏఈ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. టోర్నీ నిర్వహణ విషయంపై ఏసీసీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.