
ఢాకా: శ్రీలంక యువ ఆటగాడు కమిల్ మిషారా చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టులో భాగమై ఉన్న కమిల్ మిషారా జట్టు నిబంధనలు అతిక్రమించాడు. దాంతో శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వెంటనే జట్టును వీడి స్వదేశానికి రావాలని ఆదేశించింది. బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్ట్ల్లోనూ కమిల్ మిషారాకు అవకాశం దక్కలేదు. అయితే శ్రీలంక జట్టు బస చేస్తున్నహోటల్ గదిలో మిషారా టీమ్మేనేజ్మెంట్కు సమాచారం ఇవ్వకుండా ఓ అజ్ఞాత వ్యక్తితో గడిపినట్లు తెలుస్తుంది. ఇది నిబంధనలకు వ్యతిరేకం కావడంతో టీమ్మేనేజ్మెంట్ ఫిర్యాదు మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది.
ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించనందకుకు తక్షణమే అతడు స్వదేశానికి తిరిగి రావాలని శ్రీలంక క్రికెట్ ఆదేశించింది. 'మేం హోటల్ సీసీటీవీ ఫుటేజ్ను పరీశీలించాం. మేం చూసిన వాటిపై అతడిని విచారించాలి అనుకుంటున్నాము" అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 21 ఏళ్ల కమిల్ మిషారా ఇప్పటి వరకు మూడు టీ20లు మాత్రమే ఆడాడు. ఇక బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య తొలి టెస్ట్ డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 397 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్ 465 పరుగులు చేయగా.. శ్రీలంక 260/6 స్కోర్తో డ్రా చేసింది.
మిర్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 143 పరుగులు చేసింది.