కొలంబో: ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ రూల్స్ అతక్రమంచి వీధుల్లో చక్కర్లు కొట్టిన శ్రీలంక ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకపై ఏడాది నిషేధం విధించింది. వారు చేసిన తప్పిదానికి ఇప్పటికే జట్టు నుంచి తొలగించిన బోర్డు.. వారిని అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించడంతో పాటు కోటీ రూపాయల భారీ జరిమానా వేసింది. అలాగే దేశవాళీ పోటీల్లోనూ వారు ఆరు నెలల పాటు ఆడకూడదని స్పష్టం చేసింది. దాంతో ఈ ముగ్గరు ఆటగాళ్ల కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది.
భారత్తో సిరీస్ల ముందుకు ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంక చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్ల్లో 3-0తో క్లీన్ స్వీప్ అయింది. కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలను అత్యంత కఠినమైన బయోబబుల్ నిర్వహిస్తున్నారు. ఆటగాళ్లంతా కఠిన ఆంక్షలను పాటించాల్సిందే. కానీ లంక క్రికెటర్లు బయట తిరుగుతూ కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సిగరేట్ కాలుస్తూ అక్కడి కెమరాలకు చిక్కారు. ఇంగ్లండ్లోని ఓ మార్కెట్లో లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా తిరుగుతూ కనిపించారు. ఈ ఫొటోలు, వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారు మాస్క్ కూడా పెట్టుకోకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన నెటిజన్లు బయోబబుల్లో ఉండాల్సిన ఆటగాళ్లు బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ దేశ బోర్డు వారిని స్వదేశానికి రప్పించి విచారణకు ఆదేశించింది. చివరికి వారిని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ ముగ్గురు ఆటగాళ్లు లేకుండానే భారత్తో సిరీస్లు ఆడిన శ్రీలంక వన్డే సిరీస్ 2-1తో కోల్పోయి.. టీ20 సిరీస్ను 1-2తో కైవసం చేసుకుంది. ఫలితంగా 13 ఏళ్ల తర్వాత భారత్పై శ్రీలంక ఓ ధ్వైపాక్షిక సిరీస్ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఐదు వరుస టీ20 సిరీస్ పరాజయాల తర్వాత తొలి సిరీస్ విజయాన్నందుకుంది. గురువారం జరిగిన డిసైడర్ మూడో టీ20లో స్పిన్ ఉచ్చుల్లో ఉక్కిరి బిక్కిరి చేసిన శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది.