టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్తో తమ ఓటమిని శాసించారని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక అన్నాడు.ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేశారని చెప్పాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శుక్రవారం హోరాహోరీగా సాగిన చివరి సూపర్-4 మ్యాచ్లో టీమిండియా సూపర్ ఓవర్లో శ్రీలంకను ఓడించింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన చరిత్ అసలంక.. తమ ఓపెనర్, సెంచరీ హీరో పాతుమ్ నిస్సంకపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్లో ఓడినా నిస్సంక తన పవర్ఫుల్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. 'ఇదో అద్భుతమైన మ్యాచ్. వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్లు వచ్చి మిడిల్ ఓవర్లు వేసే వరకు ఈ మ్యాచ్లో మేం పై చేయి సాధించాం. నిస్సంక బ్యాటింగ్ అసాధారణం. భారత జట్టుకు అత్యంత అనుభవమైన గొప్ప బౌలర్లు ఉన్నారు.

అలాంటి వారిపై నిస్సంక నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం చూడముచ్చటగా అనిపించింది. సూపర్ ఓవర్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని చెప్పాను(నవ్వుతూ). కానీ అలా జరగలేదు. ఈ ఆసియా కప్లో ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. దురదృష్టవశాత్తు గత రెండు మ్యాచ్ల్లో గెలవలేకపోయాం. ఓ కెప్టెన్గా.. తీసుకోవడానికి ఈ టోర్నీలో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి.'అని పాతుమ్ నిస్సంక చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), తిలక్ వర్మ(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. సంజూ శాంసన్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 39), అక్షర్ పటేల్ (15 బంతుల్లో ఫోర్, సిక్స్తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ, దుష్మంత్ చమీర, వానిందు హసరంగ, డసన్ షనక, చరిత్ అసలంక చెరో వికెట్ తీసారు.
అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(58 బంతుల్లో7 ఫోర్లు, 6 సిక్స్లతో 107 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. కుశాల్ పెరీరా(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. డసన్ షనక(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. సూపర్ ఓవర్లో శ్రీలంక 2 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోగా.. భారత్ తొలి బంతికే మూడు పరుగులు చేసి గెలుపొందింది.