సన్రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్, శ్రీలంక స్టార్ క్రికెటర్ వానిందు హసరంగా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. అఫ్గానిస్థాన్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా సోమవారం జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లు తీసిన హసరంగా.. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
63 మ్యాచ్ల్లో హసరంగా ఈ ఫీట్ సాధించగా.. అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 53 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకొని అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 11 మంది ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల ఘనతను అందుకున్నారు.
శ్రీలంక తరఫున ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్గా హసరంగా నిలిచాడు.

అతని కంటే ముందు లసిత్ మలింగా 76 మ్యాచ్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో వానిందు హసరంగాను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేసింది.
గతేడాది వరకు ఆర్సీబీకి రూ. 10 కోట్ల ధరతో ఆడిన అతను గాయం కారణంగా సుదీర్ఘ కాలం ఆటకు దూరమవ్వడంతో పాటు ఓవర్సీస్ కోటాలో తుది జట్టులో ఆడించే పరిస్థితి లేకపోవడంతో ఆ జట్టు వదులుకుంది. మిగతా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రూ. 10 కోట్ల నుంచి అతని ధర రూ. 1.50 లక్షలకు పడిపోయింది.
అఫ్గాన్తో జరిగిన రెండో టీ20లో శ్రీలంక 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. సదీర సమరవిక్రమా(42 బంతుల్లో 5 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎంజెలో మాథ్యూస్(22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ రెండేసి వికెట్లు తీయగా.. ఫజలక్ ఫరూకీ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్ 17 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. కరీమ్ జనత్(28), మహమ్మద్ నబీ(27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో ఎంజేలో మాథ్యూస్, ఫెర్నాండో, వానిందు హసరంగా, మతీష పతీరణ రెండేసి వికెట్లు తీయగా.. తీక్షణ, డసన్ షనక చెరో వికెట్ పడగొట్టారు.