ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో విజేతగా విదర్భ జట్టు నిలిచింది. గతేడాది తృటిలో చేజారిన ఈ టైటిల్ను ఈసారి ఒడిసిపట్టుకుంది. ఆదివారం బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించింది. విదర్భ ఓపెనర్, సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అథర్వ టైడ్(118 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 128) భారీ శతకంతో విదర్భ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. అథర్వ టైడ్ భారీ శతకానికి తోడుగా...యశ్ రాథోడ్(61 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకు పన్వార్(4/65) నాలుగు వికెట్లు తీయగా.. చేతన్ సకారియా(2/45), చిరాగ్ జానీ(2/65) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్(92 బంతుల్లో 10 ఫోర్లతో 88), చిరాగ్ జానీ(63 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. విదర్బ బౌలర్లలో యశ్ ఠాకూర్(4/50) నాలుగు వికెట్లతో సౌరాష్ట్ర పతనాన్ని శాసించాడు. నచికేత్ భుటే(3/46) మూడు వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే(2/52) రెండు వికెట్లు పడగొట్టాడు. హర్ష్ దూబే ఒక వికెట్ తీసాడు. విదర్భ విజయంలో కీలక పాత్ర పోషించిన అథర్వ టైడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. విదర్బకే చెందిన అమన్ మోఖడేకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.
విజేతగా నిలిచిన విదర్భకు కోటిరూపయాల నజరానా దక్కనుండగా.. రన్నరప్ సౌరాష్ట్రకు రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్ లభిస్తుంది. విజయ్ హజారే ట్రోఫీని విదర్భ గెలుచుకోవడం ఇదే తొలిసారి. గతేడాది ఫైనల్లో కర్ణాటక చేతిలో ఓడిన విదర్భ తృటిలో టైటిల్ అందుకోలేకపోయింది. విదర్భ జట్టు రంజీ ట్రోఫీని మూడు సార్లు (2017-18, 2018-19, 2024-25) గెలుచుకున్నప్పటికీ, విజయ్ హజారే ట్రోఫీని మాత్రం ఈ సారే అందుకుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అథర్వ టైడ్ సెంచరీతో చెలరేగి విదర్భ విజయంలో కీలక పాత్ర పోషించడంపై ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అథర్వ టైడ్ను ఆరెంజ్ ఆర్మీ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో అతను ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 13 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు అథర్వ టైడ్ను సన్రైజర్స్ రిటైన్ చేసుకుంది.